కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక పథకాల్లో పీఎం కిసాన్ యోజన ఒకటి. ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం దేశంలోని అర్హత కలిగిన రైతు కుటుంబాలకు సంవత్సరానికి రూ. 6000/- ఆర్థిక సాయం అందిస్తారు. ఈ మొత్తాన్ని మూడు వాయిదాలలో చెల్లిస్తారు. నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే జమచేస్తారు. ఇప్పటివరకు 11 విడతలుగా పైసలు జమ కాగా, త్వరలో 12వ విడత డబ్బులు కూడా కూడా అన్నదాత ఖాతాల్లో పడనున్నాయి. ఈ తరుణంలో రైతులనుద్దేశించి కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఆగస్టు 31 వరకు గడువు పొడిగింపు.. ఇప్పటికే, అనేకసార్లు పీఎం కిసాన్ నిధుల కోసం, ఈ-కేవైసీ చేసుకోవాల్సిందిగా కేంద్రం రైతులను కోరింది. మునుపటి గడువు తేదీ జులై 31 పూర్తయినా, కొందరు రైతులు ఇంకా ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయలేదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని గడువును మరోసారి పొడిగించింది. పీఎం కిసాన్ వెబ్సైట్ ప్రకారం 31 ఆగస్టు 2022 వరకు గడువు పొడిగించింది. PMkisan.gov.in వెబ్సైట్ ద్వారా ఈ-కేవైసీ ప్రక్రియను ఆన్లైన్లోనే పూర్తి చేయవచ్చు. ఈ-కేవైసీ ప్రక్రియను ఆన్లైన్లో.. ముందు https://pmkisan.gov.in/ వెబ్పేజీకి వెళ్లాలి. హోమ్పేజీకి కుడి వైపు కనిపించే eKYC ఆప్షన్పై క్లిక్ చేయాలి. eKYC పేజీ ఓపెన్ అయ్యాక.. మీ ఆధార్ కార్డ్ నంబర్, క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి, సెర్చ్ ట్యాబ్పై క్లిక్ చేయాలి. ఆధార్ కార్డ్తో లింక్ అయిన మొబైల్ నంబర్ను ఎంటర్ చేయాలి. అవసరమైన సమాచారం అందించాక, 'Get OTP' అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు వన్ టైమ్ పాస్వర్డ్ వస్తుంది. ఈ OTPని ఎంటర్ చేస్తే మీ eKYC ప్రక్రియ పూర్తవుతుంది. ఈ-కేవైసీ ప్రక్రియను ఆఫ్లైన్లో.. పీఎం కిసాన్ ఈ-కేవైసీ ప్రక్రియను బయోమెట్రిక్ అథెంటికేషన్ ఉపయోగించి ఆఫ్లైన్లో కూడా పూర్తి చేయవచ్చు. రైతులు తమకు సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ వద్దకు వెళ్లి, బయోమెట్రిక్ ద్వారా పూర్తి చేయవచ్చు. ఆగస్టు 31లోపు ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయకుంటే, పీఎం కిసాన్ తదుపరి విడతను అందుకునేందుకు అనర్హులవుతారు. మరోసారి పొడిగించే అవకాశం ఉండకపోవచ్చు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద.. కేంద్ర ప్రభుత్వం రైతులకు సంవత్సరంలో మొదటి విడత ఏప్రిల్ 1 నుంచి జూలై 31 వరకు, రెండవ విడతను ఆగస్టు 1 నుంచి 30 నవంబర్ మధ్య, మూడవ విడత మెుత్తాన్ని డిసెంబర్ 1 నుంచి 31 మార్చి లోపు అందించింది. వీటిని నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తారు. ప్రస్తుతమున్న సమాచారం ప్రకారం.. వచ్చే నెల మొదటి వారంలో 12 విడత నగదు జమ కావచ్చని తెలుస్తోంది. ఒకవేళ మీరు ఇప్పటి వరకు పీఎం కిసాన్ యోజనలో మీ పేరు నమోదు చేసుకోకపోతే.. ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే.. ముందుగా పీఎం కిసాన్ యోజన అధికారిక వెబ్సైట్(https://pmkisan.gov.in/)కి వెళ్లాలి. కుడి వైపున New Former Registration కనిపిస్తుంది.. దాని మీద క్లిక్ చేయాలి. తరువాత, ఆధార్ సంఖ్య, మొబైల్ నంబర్, రాష్ట్రాన్ని ఎంపిక చేసుకోవాలి. దీనితో పాటు, క్యాప్చా కోడ్ని నమోదు చేసి.. గెట్ ఓటీపీపై క్లిక్ చేయాలి. ఈ ఫారమ్లో మీ పూర్తి వ్యక్తిగత సమాచారాన్ని ఎంటర్ చేయాలి బ్యాంక్ ఖాతా వివరాలు మరియు పొలానికి సంబంధించిన సమాచారాన్ని అందించాలి. ఆ తర్వాత మీరు ఫారమ్ను సమర్పించవచ్చు. ఆధార్ కీలకం ఈ పథకం ద్వారా నగదు పొందాలంటే రైతులు వారి బ్యాంక్ అకౌంట్కు ఆధార్ కార్డును లింక్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ బ్యాంక్ బ్రాంచ్లో డబ్బును జమ చేస్తారు. రైతులు తమ వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో https://pmkisan.gov.in/ వెబ్సైట్లో కూడా తెలుసుకోవచ్చు. అన్నీ కరెక్ట్గా ఉంటే పీఎం కిసాన్ డబ్బులు జమ అవుతాయి. వివరాల్లో తప్పులు ఉంటే వెబ్సైట్లోనే మార్పులు చేసుకునే అవకాశం ఉంది. ఇందుకోసం మీరు PM కిసాన్ హెల్ప్లైన్ నంబర్- 155261 లేదా 1800115526 (టోల్ ఫ్రీ) లేదా 011-23381092 నంబర్లను సంప్రదించవచ్చు. మీరు మీ ఫిర్యాదును PM కిసాన్ (pmkisan-ict@gov.in) అధికారిక ఈ-మెయిల్ ఐడీకి కూడా మెయిల్ చేయవచ్చు. ఇదీ చదవండి: పాడి రైతులకు శుభవార్త.. రూ.5 లక్షలు దక్కించుకునే అవకాశం!