వెంకటేశ్- విజయశాంతి జంటగా నటించిన చినరాయుడు సినిమా అందరూ చూసే ఉంటారు. ఆ సినిమాలో విజయశాంతి అప్పు తిరిగి చెల్లించలేని పరిస్థితిలో ఉండగా.. వెంకటేశ్ చదివింపుల విందు పెట్టమని తీర్పు ఇస్తాడు. అందులో వచ్చిన సొమ్ముతో అప్పు చెల్లించమని చెప్తాడు. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి సాంప్రదాయం చాలా తక్కువ మందికి తెలుసుంటుంది. కానీ, తమిళనాడులో మాత్రం ఏటా ఇలాంటి విందులు జరుగుతూనే ఉంటాయి. అలా విందు ద్వారా వసూలైన చదివింపులను గ్రామాభివృద్ధి, పేద పిల్లల పెళ్లిళ్లు, ఉపాధి కార్యక్రమాలు వంటి వాటికి వినియోగిస్తూ ఉంటారు. తంజావూరు, మధురై, పుదుక్కొట్టై జిల్లాల సరిహద్దు గ్రామాల్లో ఇలాంటి విందులు నిర్వహిస్తుంటారు. కరోనా కారణంగా రెండేళ్లుగా ఇలాంటి విందును అక్కడ నిర్వహించలేదు. కరోనా ప్రస్తుతం తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో తమిళనాడులోని పుదుక్కొట్టై జిల్లా నెడువాసల్ కిళుక్కులో జరిగిన చదివింపుల విందు ఏకంగా దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. సాధారణంగా ఆషాఢం తర్వాత వచ్చే శ్రావణ మాసంలో ఇలాంటి విందును నిర్వహిస్తుంటారు. తాజాగా పుదుక్కొట్టైలో 31 మంది గ్రామ పెద్దలు కలిసి చదివింపుల విందును ఏర్పాటు చేశారు. అందరూ భోజనం చేసిన తర్వాత అక్కడ పెట్టే పాత్రల్లో వారికి తోచినంత చదివింపులు వేస్తుంటారు. ఆ విందులో వచ్చిన చదివింపులను లెక్కించగా అంతా నోరెళ్లబెట్టారు. ఎందుకంటే ఆ విందులో ఏకంగా 15 కోట్ల రూపాయలు చదివింపులుగా వచ్చాయి. ఆర్థిక కష్టాల్లో ఉన్న ఓ వ్యక్తి 2019లో చదివింపుల విందు నిర్వహించాడు. అందరికీ చికెన్, మటన్ తో అద్భుతమైన విందు ఏర్పాటు చేశాడు. ఆ విందుకు హాజరైన జనం అతని అతిథి మర్యాదలకు మెచ్చి రూ.4 కోట్లు చదివింపులు ఇచ్చారు. ఆ ఒక్క విందుతో అతను ఏకంగా కోటీశ్వరుడు అయిపోయాడు. అప్పటి నుంచే ఈ విందుల గురించి దేశవ్యాప్తంగా తెలిసింది. రూ.15 కోట్లు చదివింపులు రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇదీ చదవండి: SBI బ్యాంకు నుంచి రూ.11 కోట్ల చిల్లర మాయం.. సీబీఐ సోదాలు! ఇదీ చదవండి: IT ఉద్యోగుల గోల్మాల్..! వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో భారీ స్కామ్!