సినిమాలలో హీరోయిజం చూపించడంలో ఒక్కో దర్శకుడి శైలి ఒక్కో విధంగా ఉంటుంది. టాలీవుడ్ లో క్లాస్ సినిమాలు తీసే దర్శకులు ఎక్కువగా ఉన్నారు. కానీ.. మాస్ సినిమాలు తీసే కొందరిలో వివి వినాయక్ ఒకరు. ఆది, దిల్, బన్నీ, చెన్నకేశవరెడ్డి, సాంబ, ఠాగూర్ ఇలా కెరీర్ లో మాస్ టచ్ ఉన్న సినిమాలు చాలా తీశారు. ముఖ్యంగా మాస్ హీరో నందమూరి బాలకృష్ణను కొత్తగా ప్రెజెంట్ చేయడంలో సక్సెస్ అయిన వినాయక్.. చెన్నకేశవరెడ్డి బాక్సాఫీస్ వద్ద తాను అనుకున్న స్థాయిలో ఆడలేదని ఇదివరకే చెప్పేశాడు. ఇక హీరోయిజం, ఫ్యాక్షనిజం జోడించి నటసింహం బాలయ్యతో తీసిన చెన్నకేశవరెడ్డి సినిమా గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు వినాయక్. అయితే.. ఈ సినిమాలో హీరోయిన్ గా టబు, హీరో చెల్లెలిగా దేవయాని నటించారు. కానీ.. మొదటగా హీరోయిన్ గా సౌందర్యను, చెల్లిగా లయను అనుకున్నట్లు తెలిపారు. అలాగే హీరోయిన్, హీరో చెల్లి క్యారెక్టర్ కాస్టింగ్ విషయంలో జరిగిన ఇన్సిడెంట్ లను షేర్ చేసుకున్నారు వినాయక్. ఆయన మాట్లాడుతూ.. "టబు పాత్రకు ముందుగా సౌందర్యను అడిగితే.. ఆమె ఓల్డ్ పాత్ర అప్పుడే వద్దని చేయనంది. తర్వాత టబును అడగ్గానే ఆమె ఓకే చెప్పింది. ఇక దేవయాని పాత్రకు స్వయంవరం హీరోయిన్ లయను ఫిల్మ్ సిటీలో కలిసి అడిగితే.. ఆమె వెంటనే కన్నీళ్లు పెట్టుకుంది. చెల్లెలి పాత్రకే ఎందుకు అడుగుతారు? తెలుగమ్మాయిలు హీరోయిన్ గా పనికిరారా? అని ఏడ్చేసింది. అలా కాదమ్మా.. నీ ముఖం ఇనోసెంట్ గా ఉందని ఈ రోల్ కోసం అడిగానని అన్నాను. వెంటనే ఆమె ఎందుకండీ అలా చూస్తారు? హీరోయిన్ గా ఎందుకివ్వరు? అని అడిగింది. ఇక నాకేం సమాధానం చెప్పాలో తెలియలేదు. ఆమెకు సారీ చెప్పి వచ్చేశా. తర్వాత దేవయానిని అడిగితే ఒప్పుకుంది" అని చెప్పారు వినాయక్. ప్రస్తుతం ఆయన మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి చెన్నకేశవరెడ్డి సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.