ఇప్పటి జనరేషన్ వాళ్లకు రెబల్ స్టార్ అంటే ప్రభాస్ గుర్తొస్తారు. అసలైన రెబల్ స్టార్ అంటే కృష్టంరాజు(83). ఇప్పుడు ఆయన అనారోగ్య సమస్యలతో మరణించడం ఇండస్ట్రీకి తీరనిలోటు. ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున 3:25 గంటలకు మరణించారు. ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి, ప్రేక్షకుల్ని అశేషంగా అలరించిన ఆయన మృతిపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ క్రమంలో కృష్ణంరాజు జీవితం, అందులో కొన్ని ముఖ్యమైన విషయాల సమాహారమే ఈ స్టోరీ. 1940 జనవరి 20న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు జన్మించారు. ఆయన చదువు పూర్తికాగానే కొన్నాళ్లు జర్నలిస్టుగా పనిచేశారు. సినిమాలపై ఉన్న ఇష్టంతో ఇండస్ట్రీలోకి వచ్చి నిలదొక్కుకున్నారు. 'చిలకా గోరింకా' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. కానీ తనలో అసలు నటుడిని బయటకు తీసేందుకు విలన్ గానూ నటించారు. సూపర్ స్టార్ కృష్ణ 'అవేకళ్లు' చిత్రంలో విలన్ గా కృష్ణంరాజు నిరూపించుకున్నారు. అలా కొన్నేళ్లపాటు ఇండస్ట్రీలో ఏలిన కృష్ణంరాజు.. 183కు పైగా చిత్రాల్లో నటించారు. భక్త కన్నప్ప, బొబ్బిలి బ్రహ్మాన్న సినిమాలు కృష్ణంరాజుకి స్టార్ స్టేటస్ తీసుకొచ్చాయి. హీరోగా ఎన్నో సినిమాల్లో నటించిన కృష్ణంరాజు.. సెకండ్ ఇన్నింగ్స్ లో ప్రభాస్ హీరోగా నటించిన బిల్లా, రెబల్, రాధేశ్యామ్ సినిమాలతో పాటు రుద్రమదేవి, ఎవడే సుబ్రహ్మణ్యం చిత్రాల్లోనూ పాత్రలు చేశారు. గోపీకృష్ణ మూవీస్ సంస్థ స్థాపించి నిర్మాతగానూ పలు సినిమాలు తీశారు. చివరగా 'రాధేశ్యామ్' సినిమాలో నటించారు. ఇక 1977, 1984లో కృష్ణంరాజు నంది అవార్డు గెలుచుకున్నారు. 1988లో 'తాండ్రపాపారాయుడు' చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్నారు. 2006లో ఫిల్మ్ ఫేర్ సౌత్ జీవన సౌఫల్య పురస్కారం, 2014లో రఘుపతి వెంకయ్య నాయుడు పురస్కారాన్ని కృష్ణంరాజు దక్కించుకున్నారు. ఇక కృష్ణంరాజు వైవాహిక జీవితం విషయానికొస్తే.. ఆయన మొదటి భార్య పేరు సీతాదేవి. వీరికి ఒక కుమార్తె కూడా ఉంది . 1995 కారు ప్రమాదంలో సీతాదేవి మరణించడంతో చాలాకాలం రెబల్ స్టార్ తీవ్ర డిప్రెషన్ లో ఉండిపోయారు. 1996లో శ్యామలాదేవితో రెండో వివాహం జరిపించారు. వీరికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఆయన సోదరుడు యూవీ సూర్యనారాయణరాజు. ఆయన కుమారుడే హీరో ప్రభాస్. కృష్ణంరాజు వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్.. బాహుబలి సినిమాలతో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించారు. పెదనాన్న పేరు నిలబెట్టారు. ఇక రాజకీయ జీవితానికొస్తే.. 1991లో తొలుత కాంగ్రెస్ లో చేరిన కృష్ణంరాజు.. అదే ఏడాది నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీచేసి తెదేపా అభ్యర్థి భూపతిరాజు విజయ్ కుమార్ రాజు చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత రాజకీయాలకు కొద్దిగా దూరంగా ఉన్నారు. మళ్లీ 1998లో 13వ లోక్ సభ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరి, కాకినాడ నుంచి ఎంపీగా పోటీచేసి విజయం సాధించారు. 1999లో మధ్యంతర ఎన్నికలు రావడంతో అప్పుడు.. నర్సాపురం లోక్ సభ నుంచి అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి కనుమూరి బాపిరాజుపై గెలిచారు. అలా కేంద్రంలో అటల్ బిహారీ వాజ్ పేయీ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా పనిచేశారు. 2004లో లోక్ సభ ఎన్నికల్లో అదే స్థానం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. 2009 మార్చిలో చిరంజీవి స్థాపించిన 'ప్రజారాజ్యం' పార్టీలో చేరారు. అలా నటుడిగా, రాజకీయ నాయకుడిగా ప్రజల మన్ననలు పొందిన కృష్ణంరాజు.. తెలుగు సినీ ప్రేక్షకులకు ఎన్నో మరపురాని సినిమాలు అందించి దివికేగారు. ఇదీ చదవండి: కృష్ణం రాజు చివరి కోరిక అదే? తీరకుండానే ఆయన స్వర్గస్తులయ్యారు..