Crime News: తమ వీధిలో ఉండే ఓ పిల్లాడిని కిడ్నాప్ చేసి, దారుణంగా హత్య చేశారు ఇద్దరు కిరాతకులు. బాలుడ్ని కిడ్నాప్ చేసిన తర్వాత కొట్టి చంపి.. రూ. 20 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు. ఈ సంఘటన మహారాష్ట్రలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మహారాష్ట్రలోని పూణె, పింప్రి చించ్వాడ ఏరియాకు చెందిన ఆధిత్య గజానన్ అనే 8 ఏళ్ల బాలుడు శుక్రవారం ఇంటినుంచి కనిపించకుండా పోయాడు. ఈ నేపథ్యంలో అతడి తండ్రి పింప్రి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు పెట్టాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అదే రోజు బాలుడి తల్లి మొబైల్కు ఓ ఫోన్ కాల్ వచ్చింది. బాలుడ్ని తాము కిడ్నాప్ చేశామని కాల్ చేసిన వ్యక్తి చెప్పాడు. పిల్లాడ్ని విడిచిపెట్టాలంటే 20 కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఫోన్ కాల్ తర్వాత పోలీసులు టెక్నికల్ టీంను రంగంలోకి దింపారు. శుక్రవారం రాత్రే మన్థన్ బోస్లే, అంకిత్ సముద్రేలను అరెస్ట్ చేశారు. ఆ ఇద్దరు తమ ఏరియాలోనే ఉంటున్నారని బాలుడి తల్లిదండ్రులు తెలిపారు. ఆ ఇద్దర్నీ పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపడింది. డబ్బుకోసం తామే ఆధిత్యను కిడ్నాప్ చేశామని వారు ఒప్పుకున్నారు. తర్వాత అతడ్ని చంపేశామంటూ బాంబ్ పేల్చారు. బాలుడు తమను ఇదివరకే చూసి ఉండటంతో పిలవగానే ఇంటినుంచి బయటకు వచ్చాడని, అప్పుడు అతడికి మత్తు మందు ఇచ్చామని తెలిపారు. అతడు స్పృహ కోల్పోయిన తర్వాత ఇంటి నుంచి దూరంగా తీసుకెళ్లామని, అక్కడ తలపై బలమైన ఆయుధాలతో కొట్టి చంపామన్నారు. తర్వాత ప్లాస్టిక్ బ్యాగులో శవాన్ని చుట్టి ఓ పాడుబడ్డ బిల్డింగ్లో పడేశామని తెలిపారు. పోలీసులు పిల్లాడి మృతదేహాన్ని వారు చెప్పిన చోటు నుంచి స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇవి కూడా చదవండి : యువతి అందం చూసి మోసపోయిన 54 ఏళ్ల వృద్దుడు.. ట్విస్ట్ మాములుగా లేదుగా!