SBI: రాజస్తాన్, కరౌలీలోని మెహదీపుర్ బాలాజీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్లో గత సంవత్సరం 11 కోట్ల రూపాయల చిల్లర మాయం అయిన సంగతి తెలిసిందే. తమ బ్యాంకులో పెద్ద మొత్తంలో చిల్లర కనిపించకుండా పోయిందని గుర్తించిన అధికారులు 2021, ఆగస్టు 16న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక, బ్యాంకు కమిటీ ప్రాథమిక దర్యాప్తులో పెద్ద మొత్తంలో చిల్లర అపహరణకు గురైనట్లు తేలింది. 2021, జులై 22న దాదాపు 13 కోట్ల రూపాయల చిల్లరకు సంబంధించిన కౌంటింగ్ మొదలైంది. బ్రాంచ్ మేనేజర్ హరగోవింద్ మీనా దీన్ని పర్యవేక్షిస్తున్నారు. రెండు వారాల తర్వాత కొంతమంది సాయుధులైన వ్యక్తులు కౌంటింగ్ జరగకుండా సిబ్బందిని బెదిరించారు. అయితే, ఆగస్టు 6 తేదీ నాటికి కేవలం 1.39 కోట్ల రూపాయల చిల్లర మాత్రమే కౌంటింగ్ జరిగింది. దాదాపు 11 కోట్ల రూపాయల చిల్లర అపహరణకు గురైంది. ఈ నేపథ్యంలో ఎస్బీఐ బ్యాంకు రాజస్తాన్ కోర్టును ఆశ్రయించింది. సీబీఐ విచారణ జరిపించాలని కోరింది. కోర్టు ఆదేశాలతో సీబీఐ రంగంలోకి దిగింది. దీనిపై 2022 ఏప్రిల్ 13న సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. తాజాగా, ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ, రాజస్తాన్లలోని 25 చోట్ల సీబీఐ సోదాలు నిర్వహించింది. ఢిల్లీ, జైపూర్, డౌసా, కరౌలీ, సావాయ్ మధుపూర్, అల్వార్, ఉదయ్పూర్, బిల్వారాలలో సోదాలు నిర్వహిస్తున్నారు. బ్యాంకుకు చెందిన 15 మంది మాజీ ఉద్యోగులకు సంబంధించిన ఇళ్లు, స్థలాల్లో కూడా సోదాలు నిర్వహించింది. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇవి కూడా చదవండి : స్కూలు ఫీజు కట్టలేదని విద్యార్థిని కొట్టి చంపిన టీచర్!