అవసరం ఉన్నా లేకపోయినా సరే.. కాల్ చేసి మంచిగా మాట్లాడి.. మన చేత అప్పు చేయించి.. ఆ తర్వాత నరకం చూపిస్తున్నారు లోన్ యాప్ నిర్వాహాకులు. కాబూలీ వాళాల కన్నా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ వ్యవహారం అంతా ఆన్లైన్లోనే జరగడంతో.. మన జుట్టు వారి చేతుల్లోకి వెళ్తుంది. డబ్బులు కావాలంటే సదరు యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. అది అన్ని రకాల పర్మిషన్లు అడుగుతుంది. డబ్బు అవసరం కారణం చేత అన్నింటికి ఓకే చెప్తున్నాం. ఇక ఆ తర్వాత మొదలవుతుంది అసలు కథ. డబ్బులు సకాలంలో చెల్లించకపోతే ఇక నరకం మొదలవుతుంది. సదరు యాప్కు చెందిన సిబ్బంది ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడటమే కాక.. ఏకంగా మన ఫోటోలు మార్ఫింగ్ చేసి మన బంధువులు, స్నేహితులకు పంపుతామని బెదిరిస్తారు. మనం అప్పు చేసిన విషయం అందరికి చెప్పి పరువు తీస్తారు. ఈ లోన్ యాప్ ఆగడాలు తాళలేక ఎందరో ప్రాణాలు తీసుకున్నారు. తాజాగా రాజమండ్రిలో లోన్ యాప్ వేధింపులు తాళలేక.. ముక్కపచ్చలారని చిన్నారులను కూడా వదిలి దంపతులిద్దరూ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సంఘటనపై సీఎం జగన్ చలించిపోయారు. అనాథలైన చిన్నారులకు చెరో రూ.5లక్షల రూపాయల సాయం ప్రకటించారు. అంతేకాక లోన్ యాప్ నిర్వాహాకుల ఆట కట్టించేందుకు కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు. రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేని లోన్ యాప్లపై కఠిన చర్యలు తీసుకోవాలని.. జనాలను వేధించే యాప్ నిర్వాహకుల తాట తీయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ నిర్ణయంతో ఈ సమస్యకు ఇప్పటికైనా పరిష్కారం లభిస్తుందో లేదో చూడాలి. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: ప్రత్యక్ష రాజకీయాల్లోకి నాగార్జున.. విజయవాడ వైసీపీ ఎంపీగా బరిలోకి! ఇది కూడా చదవండి: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై దిగ్విజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు