దిల్లీలోని విజ్ఞాన్ భవన్లో నిర్వహించిన 67వ జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఇటీవల సినీరంగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులతోపాటు ప్రేక్షకుల మన్ననలు పొందిన చిత్రాలకు అవార్డులు అందజేశారు.
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా పలువురు అవార్డులు అందుకున్నారు. మిగిలిన అవార్డు గ్రహీతలకు పురస్కారాల ప్రదానం చేసే కార్యక్రమం కొనసాగుతోంది.
బెస్ట్ ఫీచర్ ఫిల్మ్గా మలయాళం నుంచి ‘మరక్కర్’ నిలవగా, ‘భోంస్లే’ చిత్రానికి మనోజ్ బాజ్పాయీ, ‘అసురన్’ చిత్రానికి ధనుష్ ఉత్తమ నటులుగా అవార్డులను సొంతం చేసుకున్నారు.
‘మణికర్ణిక’ చిత్రానికి కంగనా రనౌత్ ఉత్తమ నటిగా అవార్డు దక్కించుకున్నారు. మరోవైపు, తెలుగులో ‘జెర్సీ’, ‘మహర్షి’ చిత్రాలకు నాలుగు విభాగాల్లో అవార్డులు లభించాయి.
అగ్ర కథానాయకుడు, సూపర్స్టార్ రజనీకాంత్కు విశిష్ట పురస్కారం వరించింది. సినీ పరిశ్రమలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘దాదాసాహెబ్ ఫాల్కే’ అవార్డు ఆయనకు లభించింది. గత నాలుగు దశాబ్దాలుగా సినీ పరిశ్రమకు ఆయన చేస్తోన్న సేవలు గుర్తించిన కేంద్రప్రభుత్వం..
ఆయన్ని ఈ పురస్కారంతో గౌరవించనుంది. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆయనకు అవార్డును అందజేయనున్నారు. మరోవైపు ఒకే ఏడాదిలో రజనీకాంత్, ఆయన అల్లుడు ధనుష్ అవార్డులు అందుకోవడం పట్ల సూపర్స్టార్ అభిమానులు హర్షం వ్యక్తం చేశారు.
ఉత్తమ చిత్రం : మరక్కర్ (మలయాళం)
ఉత్తమ నటుడు : మనోజ్ బాజ్పాయీ (భోంస్లే)
ఉత్తమ నటుడు : ధనుష్ (అసురన్)
ఉత్తమ నటి : కంగనా రనౌత్ (మణికర్ణిక)
ఉత్తమ దర్శకుడు : సంజయ్ పూరన్ సింగ్ చౌహాన్ (బహత్తర్ హూరైన్)
ఉత్తమ సహాయ నటి : పల్లవి జోషి (ది తాష్కెంట్ ఫైల్స్)
ఉత్తమ సహాయ నటుడు : విజయ్ సేతుపతి (సూపర్ డీలక్స్)
ఉత్తమ యాక్షన్ కొరియోగ్రఫీ : అవనే శ్రీమన్నారాయణ (కన్నడ)
ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ : మరక్కర్ (మలయాళం)
ఉత్తమ సంగీత దర్శకుడు (పాటలు) : డి.ఇమ్మాన్ (విశ్వాసం)
ఉత్తమ సంగీత దర్శకుడు (నేపథ్య) : ప్రబుద్ధ బెనర్జీ (జ్యేష్టపుత్రో)
ఉత్తమ మేకప్ : రంజిత్ (హెలెన్)
ఉత్తమ గాయకుడు : బ్రి.ప్రాక్ (కేసరి చిత్రంలోని ‘తేరీ మిట్టీ...’)
ఉత్తమ గాయని : శావని రవీంద్ర (బర్దో-మరాఠీ)
ఉత్తమ కొరియోగ్రాఫర్ : రాజు సుందరం (మహర్షి)