‘మిస్‌ యూనివర్స్‌’ అందాల పోటీ గురించి తెలియని వాళ్లు ఉండరు. ఇండియాకు చెందిన కొందరు ఈ పోటీల్లో పాల్గొని కిరీటాలు సైతం గెలుచుకున్నారు.

ఈ పోటీలకు ప్రపంచ వ్యాప్త క్రేజ్‌తో పాటు ఏళ్ల చరిత్ర ఉంది. ఈ పోటీలు మొట్టమొదటి సారి 1952లో మొదలయ్యాయి.

1996నుంచి 2015 వరకు మిస్‌ యూనివర్స్‌ ఆర్గనైజేషన్‌ను అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నిర్వహించేవారు.

ఆయన నోటి దురుసు పనుల కారణంగా షో టెలికాస్టింగ్‌లో ఇబ్బందులు మొదలయ్యాయి. దీంతో షో డొనాల్డ్‌ ట్రంప్‌ నుంచి చేతులు మారింది.

తాజాగా, మిస్‌ యూనివర్స్‌ ఆర్గనైజేషన్‌ను థాయ్‌లాండ్‌కు చెందిన ఓ ప్రముఖ బిజినెస్‌ ట్రాన్స్‌జెండర్‌ మహిళ అన్నె జాకపాంగ్‌ జక్రజులాటిప్‌ కొనుకున్నారు.

దాదాపు 1600 కోట్ల రూపాయలతో ఆర్గనైజేషన్‌ను తన సొంతం చేసుకున్నారు.

దీనిపై అన్నె జాక్‌పాంగ్‌ మాట్లాడుతూ.. ‘‘ మిస్‌ యూనివర్స్‌ ఆర్గనైజేషన్‌ను కొనటం చాలా గర్వంగా ఉంది.

ఆసియాలో మిస్‌ యూనివర్స్‌ పోటీలను మరింత అభివృద్ధి చేయాలని చూస్తున్నా. బ్రాండ్‌ ఎక్స్‌టెన్షన్‌ ఆలోచలు ఉన్నాయి’’ అని పేర్కొన్నారు.

ప్రస్తుతం మిస్‌ యూనివర్స్‌ పోటీలు అందమైన యువతుల కోసం మాత్రమే నిర్వహిస్తున్నారు.

ఇక ముందు ఆ పోటీలు పెళ్లైన వాళ్లకోసం, గర్భిణుల కోసం కూడా నిర్వహించే ఆలోచనల్లో అన్నె పాంగ్‌ ఉన్నట్లు తెలుస్తోంది.

2023లో జరగబోయే మిస్‌ యూనివర్స్‌ పోటీల్లో ఈ మార్పులు జరిగే అవకాశం ఉంది.

కాగా, మిస్‌ యూనివర్స్‌ పోటీలు ప్రపంచ వ్యాప్తంగా 160 దేశాల్లో టెలికాస్ట్‌ అవుతుంది.

1994లో జరిగిన మిస్‌ యూనివర్స్‌ పోటీల్లో సుష్మితా సేన్‌, 2000లో లారా దత్తా, 2021లో జరిగిన పోటీల్లో హర్నాజ్‌ సందు విజయం సాధించారు.