పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ షోయబ్‌ అక్తర్‌ తన పేస్‌ బౌలింగ్‌తో పాక్‌కు ఒంటిచేత్తో ఎన్నో విజయాలు అందించాడు. 

అతని స్పీడ్‌ను తట్టుకుని నిలబడ్డ బ్యాటర్లు చాలా తక్కువమందే ఉన్నారు. అక్తర్‌ తన హైటైమ్‌లో ఎంతో మంది బ్యాట్స్‌మెన్లను వణికించాడు.

కానీ.. ఒక్క భారత బ్యాటర్‌ మాత్రం తనను సమర్థవంతంగా ఎదుర్కొనే వాడని తెలిపాడు. అతను మరెవరో కాదు.. టీమిండియా దిగ్గజ ఆటగాడు, మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌.

దాదాపు 24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో సచిన్‌ టెండూల్కర్‌ ఎందరో బౌలర్లను ఎదుర్కొన్నాడు. సచిన్‌ వికెట్‌ తీస్తే చాలు జన్మధన్యమైనట్లే అని భావించే బౌలర్లు ఎందురో. సచిన్‌ను అవుట్‌ చేయడం అంటే మ్యాచ్‌ గెలవడం కన్నా ఎక్కువ.

కొన్ని సార్లు సచిన్‌ను అవుట్‌ చేయడం అటుంచి అతని చేతిలో బౌండరీలు బాదించుకోకుండా ఉంటే చాలు అనుకునే వారు. మరి అలాంటి ఆటగాడికి అక్తర్‌ లాంటి బౌలర్‌ను ఎదుర్కొవడం పెద్ద విషయం కాదు.

ఇదే విషయంపై అక్తర్‌ స్పందిస్తూ.. ‘1999, 2003 వరల్డ్‌ కప్‌లలో పాకిస్థాన్‌ భారత్‌ చేతిలో ఓడింది. 

ఆ టైమ్‌లో నా బౌలింగ్‌లో ఆడేందుకు చాలా మంది బ్యాటర్లు వణికిపోయేవారు. నేను బౌలింగ్‌ వేస్తుంటే కాలు కదిపేందుకు కూడా భయపడేవారు.

కానీ.. ఒక్క సచిన్‌ టెండూల్కర్‌ మాత్రం బౌలింగ్‌ను బాగా ఆడేవాడు. అలాగే వరల్డ్‌ కప్‌ లాంటి వేదికల్లో భారత్‌ చేతిలో పాకిస్థాన్‌ ఓడిపోవడానికి జట్టుపై ఉండే ఒత్తిడే ప్రధాన కారణం.

1999లో కూడా ఇదే జరిగింది. నిజానికి ఆ వరల్డ్‌ కప్‌ కంటే ముందు భారత్‌తో జరిగిన అనేక మ్యాచ్‌ల్లో పాకిస్థాన్‌ గెలిచింది. 

కానీ.. వరల్డ్‌ కప్‌కు వచ్చేసరికి సాధారణంగా ఉండే ఒత్తిడిని టీవీల్లో మీడియా వాళ్లు మరింత పెంచేసేవారు.

టీవీలు చూసి మేము కూడా మాకు తెలియకుండానే ఒత్తిడికి గురవ్వడం వల్లే మ్యాచ్‌ ఓడిపోయేవాళ్లు. భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌ అంటే క్రేజ్‌, హైప్‌, ఒత్తిడి ఎప్పుడూ ఉంటుంది.

కానీ.. వరల్డ్‌ కప్‌ లాంటి మ్యాచ్‌ల్లో మాత్రం దాన్ని మరింత పెంచేస్తారు.’ అని అక్తర్‌ అన్నాడు. కాగా గతేడాది జరిగిన టీ20 వరల్డ్‌ కప్‌లో టీమిండియాను పాకిస్థాన్‌ ఓడించింది.

కానీ.. ఐసీసీ మెగా ఈవెంట్స్‌లో పాకిస్థాన్‌ పై ఎప్పుడూ భారత్‌దే పైచేయిగా ఉంటుంది.