బాగా డబ్బు సంపాదించాలి.. త్వరగా కోటీశ్వరులు అవ్వాలి.. ఇలా కలలు కంటే సరిపోదు.. అందుకు అనుగుణంగా ఆదాయం ఉండాలి.

అలా ఆదాయం ఉన్నంత మాత్రాన ఒక్క నెలలోనో.. ఒక్క ఏడాదిలోనో కోటీశ్వరులు అవ్వడం అసాధ్యం. అందుకున్న ఏకైక సురక్షిత మార్గం.. 'పొదుపు'.

నెలనెలా కొంత మొత్తంలో పొదుపు చేస్తూ పోతే కొన్నేళ్ళకు కోటి రాబడిని నిజంగానే పొందవచ్చు. అదెలా అన్నది ఇప్పుడు చూద్దాం..

పోస్టాఫీస్ అందిస్తోన్న పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) పథకం ద్వారా మీ కళను సాకారం చేసుకోవచ్చు

ఈ పథకంలో దీర్ఘకాలం పెట్టుబడి పెట్టడం ద్వారా పెద్ద మొత్తంలో రాబడి పొందవచ్చు. 

పైగా ఈ స్కీమ్ ప్రత్యేకత ఏమిటంటే.. ఇందులో మీ పెట్టుబడి పూర్తిగా సురక్షితం. ఇది మార్కెట్ హెచ్చుతగ్గుల ద్వారా అస్సలు ప్రభావితం కాదు.

దీని వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది.

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పథకం గురుంచి మరిన్ని వివరాలు..

పీపీఎఫ్ ఖాతాను 18 సంవత్సరాలు నిండిన భారతీయ పౌరులు ఎవరైనా ఏదేని బ్యాంకు లేదా పోస్టాఫీసులో తెరవచ్చు. ఖాతా తెరవడానికి గరిష్ట వయో పరిమితి అంటూ లేదు.

కాకుంటే.. ఒక వ్యక్తి ఒక ఖాతానే తెరవాల్సి ఉంటుంది. ఇండివిడ్యువల్ అకౌంట్ తెరవడానికి మాత్రమే వీలుంటుంది. జాయింట్ ఖాతా సౌకర్యం లేదు.

కనీసం రూ. 100 డిపాజిట్ చేయడం ద్వారా పీపీఎఫ్ ఖాతాను తెరవచ్చు. అయితే ఖాతా ఓపెన్ చేశాక.. కనీసం ఏడాదికి రూ. 500 అయినా పొదుపు చేయాల్సి ఉంటుంది. 

గరిష్టంగా రూ. 1.50 లక్షల వరకూ డిపాజిట్ చేసేందుకు అవకాశం ఉంటుంది.

ఏడాదికి ఒకసారి లేదా నెలకొకసారి చొప్పున 12 నెలలు పెట్టుబడి మొత్తాన్ని కట్టుకోవచ్చు. నిబంధనల ప్రకారం.. ఈ పథకం లాకిన్ పీరియడ్.. 15 సంవత్సరాలు. ఆ తర్వాత ఇంకా కొనసాగాలి అనుకుంటే.. ప్రతి ఐదేళ్లకు ఒకసారి దీనిని పొడిగించుకోవచ్చు.

ఇలా అపరిమిత కాలానికి ఈ స్కీమ్ ను పొడిగించుకోవచ్చు. ఇలా పొడిగించుకుంటూనే అధిక మొత్తంలో రాబడి పొందవచ్చు.

ఉదాహరణకు.. మీరు రోజుకు రూ. 417 లేదా నెలకు రూ.12,500 చొప్పున 15 ఏళ్లపాటు పొదుపు చేశారనుకోండి.. మెచ్యూరిటీపై మొత్తం రూ.40.68 లక్షలు పొందుతారు.

ఇందులో.. మీ మొత్తం పెట్టుబడి రూ. 22.50 లక్షలు కాగా, వడ్డీ రూపంలో రూ. 18.18 లక్షలు మీకు ఆదాయం లభిస్తుంది.

ఇప్పుడు మెచ్యూరిటీ కాలవ్యవధిని మరో రెండు మార్లు 5 సంవత్సరాల కాలానికి పెంచుకుంటే.. 25 సంవత్సరాల తర్వాత మీ మొత్తం కార్పస్ రూ. 1.03 కోట్లు అవుతుంది.

ఈ కాలంలో మీ మొత్తం పెట్టుబడి రూ. 37.50 లక్షలు కాగా, వడ్డీ రూపంలో రూ. 65.58 లక్షలు మీకు అందుతుంది.

అంటే ఒక వ్యక్తి తాను 30 సంవత్సరాల వయస్సులో ఈ పథకాన్ని ప్రారంభిస్తే.. అతడు రిటైర్మెంట్(55) అయ్యే సమయానికి కోటి రూపాయలు అందుతాయి.

ఈ విధంగా మీ కలను సాకారం చేసుకోవచ్చన్నమాట.