ప్రపంచ వ్యాప్తంగా పలు కంపెనీలు తమ ఉద్యోగులను తగ్గించుకునే పనిని ఓ ఉద్యమంగా చేస్తున్నాయి.
అందులో భాగంగానే ఇప్పటికే ప్రముఖ కంపెనీలు అన్ని తమ ఉద్యోగుల్లో భారీ కోతను విధించాయి.
ఈ క్రమంలోనే ఓ కంపెనీ 11 వేల మందిని తీసేసి నాలుగు నెలలు గడవకముందే.. మరో 10 వేల మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది.
దాంతో ఈ నిర్ణయం తీసుకున్న అతిపెద్ద సంస్థగా ఈ సాంకతిక కంపెనీ అవతరించింది.
ఆర్థిక మాంధ్యం, లాభాల క్షీణత, ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న వ్యాపార భయాలు.. కారణం ఏదైతేనేని రోడ్డున పడుతున్నారు ఉద్యోగులు.
తాజాగా సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ మాతృసంస్థ అయిన మెటా మరోసారి లే ఆఫ్ ప్రకటించింది.
తమ కంపెనీలోని 10 వేల మందిని తొలగిస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది.
దాంతో 10 వేల కుంటుంబాలు రోడ్డున పడ్డాయి.
నాలుగు నెలల క్రితమే 11 వేల మందిని తొలగించిన మెటా సంస్థ.. రెండో దఫా ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను చేపట్టింది.
ఇక ఈ ఉద్యోగాల తొలగింపుపై మెటా చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ మార్క్ జుకర్ బర్గ్ మాట్లాడాడు.
మా టీమ్ ను తగ్గించుకునే ప్రాసెస్ లో ఈ 10 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నాం అని జుకర్ బర్గ్ చెప్పుకొచ్చాడు.
అదీకాక మేం అదనంగా నియమించుకోవాలని అనుకుంటున్న 5 వేల మందిని కూడా నియమించుకోవట్లేదు అని స్పష్టం చేశాడు.