అల్లరి నరేష్, ఆనంది జంటగా ఏఆర్ మోహన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా నవంబర్ 25న రిలీజ్ అయ్యింది.
మరి ఈ సినిమా ఎలా ఉంది? జనాన్ని ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యిందా? లేదా? అనేది రివ్యూలో చూద్దాం.
కథ: ఒక ఏజెన్సీ చుట్టూ జరుగుతుంది. ఓట్లు అడిగి వెళ్లిపోయే నాయకులే గానీ ప్రజా సమస్యలని పట్టించుకునే నాదులే లేరు అన్న ఆవేదనతో ఓట్లు వేయడమే మానేస్తారు మారేడుమిల్లి ప్రజలు.
30 ఏళ్లుగా ఓట్లు వేయకుండా తమ బతుకేదో తాము బతుకుతున్న మారేడుమిల్లి ప్రజానీకాన్ని వెతుక్కుంటూ వెళ్తారు ప్రభుత్వ అధికారులు. ఈసారి ఎలాగైనా వీళ్ళ ఓట్లు కూడా రాబట్టాలి, వందకు వంద శాతం పోలింగ్ జరగాలి అని ప్రభుత్వం నిర్ణయించుకుంటుంది.
ఏజెన్సీ ప్రజలకి ఓటు విలువ గురించి అవగాహన కల్పించడం కోసం.. ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే తెలుగు ఉపాధ్యాయుడు శ్రీనివాస్ శ్రీపాదను (అల్లరి నరేష్) మారేడుమిల్లి పంపిస్తారు అధికారులు.
రాజకీయ నాయకులపై విసుగు, విరక్తి వంటివి నరనరాల్లో నాటుకుపోయిన వారి మనసు మార్చి.. తిరిగి ఓటు వేసేలా శ్రీనివాస్ ఎలా ప్రేరేపించాడు?
ఈ క్రమంలో ఎదురైన పరిణామాలు ఏమిటి? ఒక ప్రభుత్వ ఉద్యోగిలా కాకుండా సమాజంలో ఒకడిగా ఆలోచించి వారి కోసం తీసుకున్న నిర్ణయం ఏమిటి?
చివరి వరకూ చేసిన పోరాటం? ఈ పోరాటంలో మారేడుమిల్లి ప్రజానీకం గెలిచిందా? లేదా? అనేది మిగిలిన
విశ్లేషణ: రంపచోడవరం, మారేడుమిల్లి లాంటి ఏజెన్సీ ప్రాంతాల్లోఊరికి దూరంగా ఉండే కొండ ప్రాంతాల్లో ఉండే వాళ్లకి ఏమీ ఉండవు.
ఏం కావాలన్నా 20 కిలోమీటర్లు కొండ దిగి ఊళ్లోకి రావాల్సిందే.చదువుకోవడానికి బడి ఉండదు, వైద్యానికి ఆసుపత్రి ఉండదు.
ఏదైనా జరగరానిది జరిగితే వాగు దాటుకుంటూ వెళ్ళాలి. వాగు ఉగ్రరూపం దాల్చితే ఇక బతుకు మీద ఆశలు వదులుకోవాల్సిందే.
ఒక వంతెన కోసం, ఒక ఆసుపత్రి కోసం, ఒక బడి కోసం ఏజెన్సీ వాసులు, శ్రీనివాస్ తో కలిసి చేసిన యుద్ధాన్ని దర్శకుడు మోహన్ చాలా బాగా రాసుకున్నారు.
ఓట్లు వేసి సమస్యలు పట్టించుకోకపోతే.. ఓట్లు పెండింగ్ లో పెట్టాలి అన్న కొత్త పాయింట్ ని టచ్ చేశారు దర్శకుడు.
ప్రభుత్వ ఉద్యోగిగా అల్లరి నరేష్ నటన చాలా బాగుంది. ప్రభుత్వ ఉద్యోగిలా తన కర్తవ్యాన్ని నెరవేర్చడమే కాకుండా.. ఒక మనిషిలా ఆలోచించి..
మారేడుమిల్లి ప్రజల సమస్యలకు పరిష్కార వారధిగా మారిన శ్రీనివాస్ శ్రీపాద పాత్రలో అల్లరి నరేష్ అద్భుతంగా నటించారు.
ఇక అల్లరి నరేష్ తో జతకట్టిన ఆనంది.. ఏజెన్సీ అమ్మాయిగా.. వారి యాసలో మాట్లాడుతూ బాగా నటించింది.
కలెక్టర్ గా సంపత్ రాజ్, ఏజెన్సీ వాసుడిగా శ్రీతేజ్, వెన్నెల కిషోర్, ప్రవీణ్, రఘుబాబు తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు.
సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంటుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, పాటలు పర్వాలేదు. కథ, కథనం, దర్శకత్వం బాగుంది.
ప్రీ క్లైమాక్స్ నిరాశపరుస్తుంది. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ఎద్దులకు సంబంధించి గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ పూర్ గా ఉన్నాయి.
ప్లస్ లు: కథ, కథనం అల్లరి నరేష్, ఆనంది, శ్రీతేజ్ నటన దర్శకత్వం
మైనస్ లు: ప్రీ క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశం బ్యాక్ గ్రౌండ్ స్కోర్
చివరి మాట: ఈ సినిమా చూడండి. నచ్చుతుంది మీకు.. ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం