దేశంలో అత్యంత సంపన్నుడు ఎవరా..? అని ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో మాట్లాడుతూనే ఉంటారు.
వీళ్లు ఇంత డబ్బు ఎలా సంపాదిస్తారు..? ఏం చేసుకుంటారు..? అంటూ వందల కొద్దీ ప్రశ్నల సంధిస్తూ ఉంటారు. ఆ ప్రశ్నలకు సమాధానమే ఈ వార్త.
దేశంలోనే అత్యంత సంపన్నుడిగా ముకేష్ అంబానీ నిలిచినట్లు హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్-2023 స్పష్టం చేసింది.
ప్రస్తుతం అదానీ సంపద 82 బిలియన్ డాలర్లుగా ఈ నివేదిక పేర్కొంది.
అంతేకాదు.. ప్రపంచ టాప్-10 కుబేరుల్లో భారత్ నుంచి అంబానీ ఒక్కరే స్తానం దక్కించుకున్నారు. 9వ స్థానంలో ఉన్నారు.
ఇక దేశంలో అత్యంత సంపన్నుల్లో అదానీ గ్రూప్ సంస్థల అధిపతి గౌతమ్ అదానీ 53 బిలియన్ డాలర్ల సంపదతో రెండో స్థానంలో ఉన్నారు.
అంబానీ అగ్రస్థానానికి చేరడానికి ఆర్ఐఎల్ షేర్ల పెరుగుదల ప్రధాన కారణమైనప్పటికీ, అదానీ షేర్లు క్షీణించడం కూడా ఒక కారణమే.
హిండెన్బర్గ్ ఆరోపణల నేపథ్యంలో అదానీ సంపద పెద్ద ఎత్తున కరిగిపోయిన విషయం అందరికీ తెలిసిందే.
అదానీ సంపద పెరగడానికి మార్కెట్ మాయాజాలమే కారణమని హిండెన్బర్గ్ సంస్థ సంచలన ఆరోపణలు చేసింది.
దీంతో అదానీ కంపెనీ షేర్లు ఢమాల్మన్నాయి. ఫలితంగా లక్షల కోట్ల అదానీ గ్రూప్ సంపద ఆవిరయ్యింది.
అయితే, ఈ ఏడాది ప్రారంభం వరకు అదానీ అంతర్జాతీయ కుబేరుల స్థానంలో రెండో స్థానంలో ఉండేవారు.
గ్రూప్ కంపెనీలతోపాటు వ్యక్తిగత సంపద కూడా కరిగిపోవడంతో ఆయన ఇప్పుడు ప్రపంచ సంపన్నుల జాబితాలో 23వ స్థానానికి పడిపోయారు.
ఇక, హూరన్ జాబితాలో అత్యధిక బిలియనీర్లు కలిగిన దేశాల్లో అమెరికా, చైనా, భారత్ వరుసగా మూడుస్థానాల్లో ఉన్నాయి.
గతేడాది భారత్ నుంచి 215 మంది కుబేరులు ఉండగా, ఈసారి ఆ సంఖ్య 187కు తగ్గింది.
దేశంలో అత్యధిక కుబేరులు ముంబై నుండి 66 మంది ఉండగా, ఢిల్లీ నుండి 39, బెంగళూరు నుండి 21 మంది ఉన్నారు.
భారత కుబేరులు వరుసగా అంబానీ, అదానీ, సైరస్ పూనావాలా, శివ్ నాడర్, లక్ష్మీ మిట్టల్, ఎస్పీ హిందూజా, దిలీప్ షాంఘ్వీ, రాధాకిషన్ దమానీ, కుమార్ మంగళం బిర్లా, ఉదయ్ కొటక్ ఉన్నారు.