ఎండాకాలం వచ్చేసింది. ఇంట్లో నుండి బయట అడుగు పెట్టేమంటే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు.

దీంతో చల్లటివి తినాలని ఆరాటపడుతుంటాం. చల్లటి నీళ్లు, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్‌లు వంటి శీతల పదార్థాలు లాగించేస్తుంటాం.

అయితే తిన్నప్పుడు ఏమీ అనిపించదు కానీ.. ఆ తర్వాత వీటి వల్ల రోగాలు కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. 

ముఖ్యంగా కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ వంటి వాటి వల్ల శరీరంలో చక్కెర శాతం పెరగడం, శ్వాస కోశ సంబంధిత సమస్యలు వస్తూ ఉంటాయి.

ఇక పిల్లలు సంగతి చెప్పనక్కర్లేదు. వీరిని కట్టడి చేయడం కూడా కష్టమే. ఇవి తిన్న దగ్గర నుండి జలుబు, ఆయాసం వంటి సమస్యలతో బాధపడుతుంటారు.

కానీ ఇంట్లోనే ఆరోగ్య కరమైన పానీయాలు చేసుకుని.. ఆస్వాదించవచ్చు. అవేంటో చూద్దాం.

లస్సీ.. ఇది ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందాన్ని ఇస్తుంది. చిక్కటి పెరుగులో కాస్తంత పంచదార వేసుకుని, కాస్తంత చిలక్కొని తాగితే.. ఆ మజానే వేరు. ఇది వేసవిలో మంచి హెల్తీ డ్రింక్.

నిమ్మ రసం.. ఇది ఎండాకాలంలో సులభంగా చేసుకునే పానీయం. రెండు పెద్ద సైజు నిమ్మకాయలను తీసుకుని, ఓ గ్లాసులో పిండి అందులో నీరు పోసి కాస్త ఉప్పు, కాస్త పంచదార కలిపి తాగితే.. శరీరంలో ఉష్ణోగ్రత కూడా తగ్గిపోతుంది.

ఇందులో జీలకర్ర పొడి, ధనియాల పొడి కూడా వేసుకుని తాగితే భలే రుచిగా ఉంటుంది. ఈ నిమ్మరసంలో సీ విటమిన్ లభిస్తుంది. ఈ సారి ఇలా ట్రై చేసి చూడండి

రాగి జావ. సమ్మర్‌లో  మంచి బలవర్థకమైన పానీయం. రాగి పిండిని తీసుకుని.. దానిని నీళ్లలో వేసి కాస్త నాన బెట్టాలి, పొయ్యి మీద గిన్నెలో నీళ్లు వేడి పెట్టుకుని ఈ మిశ్రమాన్ని అందులో కలుపుకుని.. ఉడకబెట్టాలి. 

చల్లారాక మజ్జిగ, పెరుగు లేదా నిమ్మరసం వేసుకుని తాగితే.. నా సామి రంగా అనాల్సిందే. రాగుల్లో ఐరన్, ప్రోటీన్, విటమిన్ బి12 అనేక మినరల్స్ ఉంటాయి

బార్లీ.. ఈ గింజలను నానబెట్టి అనంతరం దాన్ని ఉడకబెట్టాలి. బాగా పల్చగా కాచుకుని .. చల్లారాక అందులో నిమ్మ రసం పిండుకుని తాగినా, లేదా పంచదార వేసుకుని తాగినా.. శరీరంలోని వేడిని తగ్గిస్తుంది.

ఎండకాలంలో పచ్చళ్లు తినేసి  బాధపడుతున్న వారికి బార్లీ గింజల నీరు బాగా పనిచేస్తుంది.  ముఖ్యంగా కిడ్నీ వ్యాధులు ఉన్నవారికి బార్లీ నీళ్లు అమృతంతో సమానం.

మజ్జిగ. ఇది రోజు తీసుకున్నా.. వేసవిలో ఎక్కువ మోతాదులో తీసుకుంటే మంచిది. ఇంట్లో పుష్కలంగా దొరికే ఏకైక పానీయం ఇదే.

కొద్దిగా పెరుగులో రెండింతలు నీరు పోసి కొద్దిగా ఉప్పు వీలుంటే నిమ్మకాయ పిండుకొని కొద్దిగా కొత్తిమీర చల్లి తాగితే కడుపులో చల్లగా ఉంటుంది.

సబ్జాలు.. వీటితో పావు గంటలో పానీయం తయారు చేసుకోవచ్చు. వీటిని కాస్త నీటిలో వేసి నానబెట్టుకుని, ఆ తర్వాత ఎక్కువ మోతాదు నీళ్లలో కలుపుకుని, చక్కెర, నిమ్మరసం, కాస్తంత పుదినా వేసుకుని తాగితే .. ఆ డ్రింక్ మజానే వేరు. దీని ద్వారా వెయిట్ లాస్ కూడా అవుతారు.

ఆ తర్వాత ఎక్కువ మోతాదు నీళ్లలో కలుపుకుని, చక్కెర, నిమ్మరసం, కాస్తంత పుదినా వేసుకుని తాగితే .. ఆ డ్రింక్ మజానే వేరు. దీని ద్వారా వెయిట్ లాస్ కూడా అవుతారు.

ఇవే కాదూ సగ్గు బియ్యం  పలచగా కాచుకుని తాగడం.. సుగంధి వంటివి కూడా వేసవి తాపాన్ని తీరుస్తాయి.