చార్ధామ్ యాత్ర చేసే వారికి జోషీమఠ్ ప్రాంతం గురించి పరిచయం అక్కర్లేదు.
ఉత్తరాఖండ్, చమోలి జిల్లాలో.. 6000 అడుగుల ఎత్తులో జోషీమఠ్ ప్రాంతం ఉంది.
హిందువులకు పరమ పవిత్రమైన బద్రీనాథ్.. సిక్కులకు పవిత్రమైన హేమకుండ్ లాంటి పుణ్యక్షేత్రాలకు స్వాగతం పలుకుతున్నట్లుగా ఉంటుంది.
ఎనిమిదో శతాబ్దంలో జగద్గురు ఆదిశంకరాచార్యలకు ఇక్కడే జ్ఞానోదయం అయ్యిందని చెబుతారు.
అలానే ఆదిశంకరాచార్యులు.. దేశ నలుదిక్కుల ఏర్పాటు చేసిన నాలుగు పీఠాల్లో జోషీమఠ్ ఒకటి. ఇది ఉత్తరామ్నాయ మఠ్ పీఠం.
ఇంతటి ఘన చరిత్ర కలిగిన జోషీమఠ్లో ప్రస్తుతం విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి.
ఇళ్లు బీటలు వారుతున్నాయి.. నేలపై ఎక్కడ చూసినా పగుళ్లే. ఇళ్లలోకి నీరు ఉబికి వస్తుంది. భూమి నుంచి వింత శబ్దాలు వినిపిస్తున్నాయి.
600 వందలకు పైగా ఇళ్లు బీటలు వారాయి. ప్రజలు ప్రాణాలు అరచేత పెట్టుకుని బతుకున్నారు.
ప్రభుత్వం వీరిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తుంది. అలానే ప్రమాదకరంగా ఉన్న భవనాల కూల్చివేతకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఉత్తరాఖండ్ ప్రభుత్వం జోషీమఠ్ను కుంగిపోతున్న నగరంగా ప్రకటించింది.
జోషీమఠ్లో ఈ పరిస్థితి ఏర్పడటానికి ప్రధాన కారణం.. ఇక్కడ చేపట్టిన రోడ్డు విస్తరణ పనులే అంటున్నారు నిపుణులు.
ప్రభుత్వం ఇక్కడ 20 కిలోమీటర్ల మేర రహదారిని వెడల్పు చేసే పనులు చేపట్టింది.
దానికోసం విపరీతంగా చెట్లు నరకడం.. అడ్డుగా వచ్చిన బండరాళ్లను పేల్చడం వంటి పనులు యథేచ్చగా సాగించింది.
ఫలితంగా ఈ పరిస్థితులు తలెత్తాయి అంటున్నారు నిపుణులు.
ఎన్టీపీసీకి చెందిన తపోవన్ విష్ణుగడ్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్.. నిర్మాణం జోషీమఠ్కు అతిపెద్ద ముప్పుగా మారింది.
జోఠీమఠ్లో ఇలాంటి పరిస్థితులు వస్తాయని.. సుమారు 50 ఏళ్ల క్రితమే మిశ్రా కమిటీ హెచ్చరించింది.
శాశ్వత పరిష్కార దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.