నిజం చెప్పులు వేసుకుని బయటకి వచ్చే లోపు.. అబద్దం నాలుగు ఊర్లు చుట్టేసి ఉంటుంది అంటారు. మన పెద్దలు చెప్పిన ఈ మాట అక్షర సత్యం. ముఖ్యంగా ఈ సోషల్ మీడియా యుగంలో నిజం ఏమిటో, అబద్దం ఏమిటో తెలుసుకోకుండా నెటిజన్స్ ప్రతి దానిని వైరల్ చేస్తున్నారు. కరోనా కాలంలో ఇప్పటికే కావాల్సినంత ఫేక్ న్యూస్ లు వైరల్ అవుతుండగా.. కరీంనగర్ లోని ఓ ఆకతాయి ఇలాంటి ఓ వింతైన తప్పుడు వార్తని సృష్టించాడు. కరీంనగర్ జిల్లాలో ఓ పాము వింత అరుపులు అరుస్తుందన్న వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. ఈ పాము రామడుగు మండలం వెలిచాల గ్రామం ఇందిరమ్మ కాలనీలోని నీలగిరి చెట్ల మధ్య సంచరిస్తోందని, ఆ పాము నోరు తెరిస్తే వింత అరుపులు వస్తున్నాయంటూ ఓ యువకుడు ఫేస్ బుక్ వాట్సప్ గ్రూప్స్ లో పోస్ట్ చేశాడు. చూడగానే వింతగా అనిపిస్తూ ఉండటంతో నెటిజన్స్ ఈ వీడియోని తెగ షేర్ చేశారు. ఇలా కొన్ని గంటల్లోనే అరిచే పాము వీడియో రెండు తెలుగు రాష్ట్రాలలో వైరల్ అయ్యింది. దీనికి తోడు.., శాటిలైట్ ఛానెల్స్ కూడా ఈ వార్తకి కవరేజ్ ఇవ్వడంతో ప్రజలు సులభంగా నమ్మేశారు.
దీంతో.., ఆ పాము గుట్టు కనిపెట్టడానికి పోలీసులు రంగంలోకి దిగక తప్పలేదు. అరిచే పాములు నిజానికి చాలా అరుదు. నిజానికి అవి ఇండియాలో ఉండేందుకు ఆస్కారం లేదు. కాబట్టి.. ఇదేదో ఫేక్ వీడియోలా ఉందని అటవీ అధికారులు కూడా అనుమానాలు వ్యకితం చేశారు. దీంతో.. పోలీసులు ఈ వీడియో అప్లోడ్ చేసిన ఆ యువకుడిని పట్టుకుని విచారణ ప్రారంభించారు. ఈ విచారణలో అందరూ షాక్ అయ్యే న్యూస్ బయటపెట్టాడు ఆ ఆకతాయి. తరువాత స్థానిక ఎస్సై తాండ్ర వివేక్ అసలు నిజాన్నీ బయటపెట్టాడు. ఇదంతా అబద్దమని ఆయన వెల్లడించారు.ఈ వీడియోను నెలరోజుల క్రితం విదేశాలకు చెందిన మైక్ మార్టిన్ అనే యూట్యూబర్ తన ఛానల్లో ‘హోంగోస్ హిట్స్ ద హై నోట్స్’ అనే పేరుతో అప్లోడ్ చేశాడని ఎస్సై వివేక్ తెలిపాడు. ఆ వీడియోను వెలిచాల గ్రామంలోదిగా పేర్కొంటూ ఓ ఆకతాయి సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టు చేశాడని అన్నారు. సదరు యువకుడిని మరింతగా విచారిస్తున్నామని, ప్రజలెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎస్సై వివేక్ తెలిపారు. చూశారు కదా..? నిజా నిజాలు తెలుసుకోకుండా.., అన్నీ వార్తలను గుడ్డిగా నమ్మేసి.., సోసిల్ మీడియాలో షేర్ చేస్తే ఇలాంటి అనర్ధాలు తప్పవు. మరి ఈ మొత్తం వ్యవహారంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.