సోషల్ మీడియా ప్రభావం పెరిగిన తర్వాత ఎవరు ఎప్పుడు? ఎలా? స్టార్లుగా మారుతున్నారో ఎవరూ చెప్పలేకపోతున్నారు. తమలోని టాలెంట్ని పరిచయం చేసేందుకు సోషల్ మీడియా ప్రధాన మాధ్యమంగా మారిపోయింది. ఇంటర్నెట్లో ఎన్నో విషయాలు వైరల్ అవుతూ ఉంటాయి. వాటిలో చాలా ఫన్నీ విషయాలు, ఫన్నీ వీడియోలు కూడా ఉంటాయి. కొందరు టాలెంట్ చూపించి వైరల్ అయితే.. ఇంకొందరు భయం, తడబాట్లు వీడియోలుగా మారి వైరల్ అయిన వాళ్లు కూడా చాలా మందే ఉన్నారు. అలాంటి ఫన్నీ వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అదికూడా ఎవరో పెద్దవాళ్లు కాదు.. ఓ చిన్నోడు చేసిన పని ఇప్పుడు అందరినీ నవ్విస్తోంది.
విషయం ఏంటంటే.. ఓ కుర్రాడు తమ ఊరిలో ఎగ్జిబిషన్కు వెళ్లాడు. కావాలని ఎక్కాడో లేక ఎవరో ఒకరు బలవంతం చేస్తే ఎక్కాడో తెలియదు. కానీ, ఎక్కిన తర్వాత ఆ కుర్రాడు చేసిన గోల అంతా ఇంతా కాదు. “ఆపేయండ్రో.. నేను జన్మలో ఎక్కను బాబోయ్. అమ్మా దుర్గమ్మ తల్లి కాపాడమ్మ. నేను మళ్లీ జన్మలో ఎక్కను కాపాడమ్మా” అంటూ కేకలు వేశాడు. ఆ మొత్తాన్ని అ కుర్రాడితో పాటుగా రంగులరాట్నం ఎక్కిన వాళ్లు వీడియో తీసి నెట్టింట పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ అవుతోంది. ఆ కుర్రాడి కేకలు అచ్చు నువ్వు నాకునచ్చావ్ సినిమాలో రోలర్ కోస్టర్ ఎక్కిన బ్రహ్మానందం చేసిన గోల మాదిరిలాగానే ఉందంటూ కామెంట్ చేస్తున్నారు.