హిజ్రాలు అంటే సమాజంలో చిన్న చూపు చూస్తారు. వారు జబర్దస్తీ చేసి డబ్బు వసూలు చేస్తారని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడతారని, రైళ్లల్లో బలవంతంగా డబ్బులు వసూలు చేస్తారని ఎక్కువ మంది భావిస్తారు. నిజానికి.. మంచివారు, చెడ్డవారు ఆడ, మగ జాతుల్లో ఎలా ఉన్నారో.. హిజ్రాల్లో కూడా మంచి వాళ్ళు, చెడ్డవాళ్ళు ఉంటారు. కొందరు చేసిన తప్పుని ఎత్తి చూపిస్తూ అందరినీ అదే గాటికి కట్టేయడం కూడా కరెక్ట్ కాదు. హిజ్రాల్లోనూ పట్టుదలతో కస్టపడి పైకి వచ్చిన వారు ఉన్నారు. తమ వారి అభివృద్ధి కోసం కష్టాలు పడుతున్న వారు ఉన్నారు. ఇలాంటి ఘటన గురించే ఇప్పుడు మనం తెలుసుకుందాం. కాంచన సినిమాలో ఓ హిజ్రా చేయూతతో మరో హిజ్రా డాక్టర్ చదివింది.. తాజాగా ఓ హిజ్రా భిక్షాటన చేసి.. వచ్చిన డబ్బులతో ఓ బాలికను కిక్ బాక్సర్ చేసింది. ఈ ఘటన కర్నాటకలోని మైసూర్ లో చోటు చేసుకుంది.
మైసూర్ కు చెందిన అక్రం పాషా అలియాస్ షబానా అనే హిజ్రా స్థానికంగా భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తోంది. అదే నగరంలోని సెయింట్ ఆంటోని ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న బీబీ ఫాతిమాకు కిక్ బాక్సింగ్ అంటే ఇష్టం. కానీ.., కిక్ బాక్సింగ్ నేర్చుకోవడానికి ఆర్థిక సమస్య అడ్డుగా ఉండేది. వరుసకు మనవరాలు అయ్యే ఈ ఫాతిమా ఆసక్తిని గుర్తించిన షబానా.. కిక్ బాక్సింగ్ కోసం ఆమెకు ఆర్థిక సాయం చేసింది. ఈ హిజ్రా నిత్యం భిక్షాటన చేసి కూడబెట్టిన డబ్బును ఫాతిమా శిక్షణ కోసం ఖర్చు చేసింది. గతవారం మాహారాష్ట్రలోని పుణెలో నిర్వహించిన “వాకో ఇండియా నేషనల్ కిక్ బాక్సింగ్” పోటీల్లో పాల్గొన్ని.. ఫాతిమా బంగారు పతాకం సాధించింది. ఇక్కడితో ఆగకుండా.. అంతర్జాతీయ స్థాయిలో పతకం సాధించాలనే ఆశయంతో ఫాతిమా ఉన్నట్లు షబానా వెల్లడించారు. తన భిక్షాటనతో ఓ బాలిక ఉన్నతికి కృషి చేస్తున్న షబానా రియల్ కాంచన అంటూ అంతా కితాబు ఇస్తున్నారు. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.