Bhimavaram: కూతురంటే ఏ తండ్రికి మాత్రం ప్రేముండదో చెప్పండి. ఇంట్లో ఆడపిల్ల పుడితే.. మహాలక్ష్మి పుట్టిందని మురిసిపోయేది మొదట తండ్రే. కూతుర్ని గుండెలపై ఎత్తుకుని ఆడిస్తాడు. ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. విద్యాబుద్ధులు నేర్పించి.. తనలా తన కూతుర్ని బాధ్యతగా చూసుకునే వ్యక్తికి ఆమెను జత చేయడానికి చూస్తాడు. కూతురికి పుట్టిన బిడ్డలను ఆడిస్తూ మురిసిపోతాడు. అలా కాకుండా పెళ్లీడుకొచ్చిన కూతురు అకస్మాత్తుగా తనను విడిచి దూరంగా వెళ్లిపోతే ఆ తండ్రి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించటం కష్టం. ఎందుకంటే ఆ తండ్రి బతికినన్నినాళ్లు నరక వేదనను అనుభవిస్తాడు. ప్రతీక్షణం కూతురు తనతో లేదన్న విషయాన్ని గుర్తు చేసుకుంటూ అల్లాడిపోతాడు.
కానీ, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం రాయలం గ్రామానికి చెందిన ఓడపాటి రవితేజ ఇందుకు భిన్నంగా ప్రవర్తించారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు ప్రసన్నా దేవి 18 ఏళ్ల వయసులో చనిపోయింది. కొన్ని నెలలు బాధపడ్డా తర్వాత తేరుకున్నారాయన. తన కూతురు దేవత అంశగా భావించి.. ఆమెకు ఏకంగా ఇంట్లోనే గుడి కట్టారు. ప్రతిరోజు పూజలు చేస్తున్నారు. అంతేకాదు! ఆమె పేరిట ఓ ట్రస్ట్ ఏర్పాటు చేశారు. ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి సహాయం చేస్తున్నారు. ఇలా తన తండ్రి ప్రేమను చాటుకుంటున్నారు. రవితేజ చేస్తున్న పనికి జనం జేజేలు పలుకుతున్నారు. నిజమైన ప్రేమంటే ఇదే అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.