ఇటీవల సినిమా పరిశ్రమలో వరుసగా నటీనటులు పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఈ నెలలోనే టాలీవుడ్ అగ్ర హీరో శర్వానంద్ ఓ ఇంటి వాడయ్యాడు. రక్షితా రెడ్డిని డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నాడు. అలాగే మెగా ఫ్యామిలీలో ఆరడుగుల అందగాడు వరుణ్ తేజ్- నటి లావణ్య త్రిపాఠి ఈ నెలలోనే ఎంగేజ్ మెంట్ చేసుకోనున్నారన్న వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అలాగే అక్కినేని ఇంట్లో కూడా భాజాలు మోగుతాయని రూమర్లు షికార్లు చేస్తున్నాయి. నాగార్జున మేనకోడలు.. సుప్రియ, యంగ్ టాలెంటెడ్ అడవి శేష్ కూడా ఈ నెలలో పెళ్లి చేసుకోబోతున్నారని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.
అయితే ఇప్పుడు ఓ నటీ మణి ఇల్లాలు అయ్యింది. బాలీవుడ్ ప్రముఖ నటి సోనాలి సైగల్.. తన చిరకాల స్నేహితుడు అపేష్ ఎల్ సజ్నానీని పెళ్లి చేసుకుంది. బాలీవుడ్లో తన తొలి సిరీస్ ‘ప్యార్ కా పంచ్నామా’తో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ నటి. ఆ తర్వాత ప్యార్ కా పంచ్ నామా -2లో కూడా కనిపించింది. వీరి పెళ్లి ముంబయిలో అంగరంగ వైభవంగా జరిగింది. కార్తీక్ ఆర్యన్ తో సహా పలువురు వీరి పెళ్లికి హాజరై.. అభినందనలు తెలిపారు. అతను ముంబైలో ఓ రెస్టారెంట్ను నిర్వహిస్తున్నాడు. ఎంతో కాలంగా డేటింగ్లో ఉన్న వీరిద్దరూ ఈ రోజు మూడు ముళ్లతో ఏకమయ్యారు. పెళ్లి తర్వాత ఈ జంట కెమెరాలకు ఫోజులిచ్చారు. వధువు గులాబీ రంగు, వరుడు తెలుపు రంగు దుస్తులు ధరించారు. అలాగే ఆమె పెళ్లి వేదికపైకి వచ్చేటప్పటికీ.. తన కుక్కను వెంట తెచ్చుకోవడం గమనార్హం.