దేశంలో ప్రభుత్వ బడుల్లో విద్యను అభ్యసించేందుకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆసక్తిని చూపడం లేదు. కారణం అక్కడ మౌలిక సదుపాయల లేమి. క్లాసులకు తగ్గట్లుగా గదులు లేకపోవడం, బెంచీలు, బాత్రూమ్స్ వంటి కనీస సదుపాయలు ఉండవు. కానీ ఓ చిన్నారి మాత్రం తన పాఠశాల దుస్థితి గురించి ఏకంగా ప్రధాని మోదీకే విన్నవించింది.
దేశంలో పేద, మధ్య తరగతి కుటుంబాల్లోని చిన్నారులు ఎక్కువగా చదువుకునేది ప్రభుత్వ బడుల్లోనే. ఈ బడుల్లో చదువుకుని.. పేరు ప్రఖ్యాతలు గడించిన వారు అనేక మంది ఉన్నారు. అయితే సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడంతో ఇప్పుడు విద్యార్థులు ఈ ప్రభుత్వ బడులకు దూరం అవుతున్నారు. మా బడుల్లో సమస్యలు ఇలా ఉన్నాయని ఆయా రాష్ట్రాల ప్రభుత్వాల దృష్టికి వెళుతున్నా.. తూతూ మంత్రంగా పనులు సాగుతున్నాయి. కానీ ఓ చిన్నారి చూస్తూ ఊరుకోలేదు. ఏకంగా ప్రధాని మోదీకే విన్నవించింది. తాను చదువుతోన్న ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సౌకర్యాలపై ఏకరువు పెడుతూ ఓ వీడియో చేయగా.. ప్రస్తుతం వైరల్గా మారింది. తమ కోసం మంచి భవనం కట్టించాలని ప్రధానిని బాలిక కోరింది.
మొత్తం ఐదు నిమిషాల వీడియోలో మోదీకి తన స్కూల్ దుస్థితి గురించి వివరించింది. ముందుగా మోదీకి నమస్కారాలు తెలిపిన బాలిక.. తాను జమ్మూ కశ్మీర్లోని కథువా జిల్లా లొహయ్-మల్హర్ గ్రామానికి చెందిన సీరత్ నాజ్గా పరిచయం చేసుకుంది. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నట్టు తెలిపింది. ఆ తర్వాత తన పాఠశాల గురించి ఒక్కొక్కటిగా వీడియోలో చెప్పడం ప్రారంభించింది. అందులో చాలా అధ్వానంగా స్కూల్ ఉన్నట్లు తెలుస్తోంది. ‘మోదీజీ ఇది మా స్కూల్’ అంటూ మెట్లను చూపించగా.. అవి రాళ్లతో, చెత్తతో ప్రమాదంగా ఉన్నాయి. అనంతరం కాంపౌండ్లోకి వెళ్లిన మూసి ఉన్న గదులను చూపించి..‘ప్రిన్సిపాల్ ఆఫీస్, స్టాఫ్ రూమ్’అని వివరించింది. ఫ్లోర్లింగ్ ఎంత మురికిగా ఉందో చూడండి.. దీనిపైనే మమ్మల్ని కూర్చోబెడతారు అని తరగతి గదులను చూపించింది.
మా స్కూల్ ఉన్న పెద్ద బిల్డింగ్ని మీకు చూపిస్తాను అంటూ.. గత ఐదేళ్లుగా భవనం ఎంత అపరిశుభ్రంగా ఉందో చూడండని ముందుకు వెళ్లింది.‘ నేను మిమ్మల్ని భవనం లోపలికి తీసుకెళ్తాను.. మా కోసం మంచి స్కూల్ కట్టాలని ప్రాధేపడుతున్నాను.. మురికిగా ఉన్న ఫ్లోర్పై కూర్చోవడంతో మా యూనిఫామ్స్ మాసిపోతున్నాయి. యూనిఫారాలు మురికిగా ఉన్నాయని మా అమ్మలు తరచూ మమ్మల్ని తిడతారు. ఏం చేయం.. మాకు కూర్చోవడానికి బెంచీలు లేవు’ అని చెప్పింది. అలా స్కూల్ మొత్తాన్ని చూపిస్తూ.. ప్లీజ్ మోదీజీ.. స్కూల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపర్చాలని విజ్ఞప్తి చేసింది.
అనంతరం కిందకు దిగి.. కాంపౌండ్ వాల్ వద్దకు వెళ్లి విరిగిపోయి ఉన్న టాయ్లెట్ను చూపించింది. ఈ వీడియోలో ఎటు చూసినా మౌలిక సదుపాయాల లేమీ కనినిపిస్తోంది.‘మోదీజీ మీరు దేశం మొత్తం చెప్పేది వినండి.. దయచేసి నా మాట కూడా వినండి.. మాకు మంచి పాఠశాలను నిర్మించండి.. నేలపై కూర్చోవాల్సిన అవసరం లేని విధంగా పాఠశాల ఉండాలి. నా యూనిఫాం మురికిగా ఉందని మా అమ్మ నన్ను తిట్టదు. తద్వారా మేమంతా బాగా చదువుకుంటాం. దయచేసి మా కోసం ఒక చక్కని పాఠశాలను నిర్మించండి’ అని వీడియోను ముగించింది. వీడియోను స్థానిక మీడియా తన ఫేస్బుక్లో షేర్ చేయగా.. 2 మిలియన్లకుపైగా వ్యూస్, దాదాపు 1.20 లక్షల వ్యూస్ వచ్చాయి.