Bengaluru: బెంగళూరు నగరాన్ని కొద్దిరోజుల క్రితం వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. ఈ వరదల కారణంగా ఎన్నో వాహనాలు నీళ్లలో మునిగి పాడైపోయాయి. పెద్ద పెద్ద రిపేర్లు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే పాడైన తన కారును రిపేర్ చేయించటానికి చూసిన ఓ వ్యక్తికి దిమ్మ తిరిగిపోయే షాక్ తగిలింది. అతడు తన కారును కొన్న ధర కంటే ఎక్కువగా అంచనా బిల్లు వచ్చింది. 11 లక్షల రూపాయల కారుకు ఏకంగా 22 లక్షల రూపాయల బిల్లు వచ్చింది. వివరాల్లోకి వెళితే.. బెంగళూరుకు చెందిన అనిరుధ్ గణేష్కు వోక్స్వేగాన్ ఆపిల్ కారు ఉంది. కొద్దిరోజుల క్రితం నగరంలో వచ్చిన వరదల కారణంగా కారు బాగా పాడైంది.
దాన్ని బాగు చేయించటానికి కంపెనీ షోరూమ్కు తీసుకెళ్లాడు. 20 రోజుల తర్వాత షోరూమ్ నుంచి 22 లక్షల రూపాయలకు అంచనా బిల్లు వచ్చింది. దీంతో గణేష్ దిమ్మతిరిగింది. 11 లక్షల రూపాయల కారుకు 22 లక్షల రూపాయల బిల్లేంటి అనుకున్నాడు. ఇన్స్రెన్స్ కూడా వర్తించదని షో రూమ్ వాళ్లు తెలిపారు. దీంతో గణేష్ కారును వెనక్కు తెచ్చుకోవటానికి షోరూమ్కు వెళ్లాడు. అయితే! కారును వెనక్కు తీసుకెళ్లటానికి 44 వేల రూపాయలు కట్టమని షో రూమ్ వారు మరోషాక్ ఇచ్చారు. ఇప్పుడు మార్కెట్లో ప్రస్తుతం 6 లక్షల రూపాయలు ధర ఉన్న కారుకోసం అంత ఛార్జీలు ఏంటి అనుకున్నాడు.
కంపెనీ కాల్ సెంటర్కు ఫోన్ చేశాడు. వారి దగ్గరినుంచి 48 గంటలు గడిచినా కూడా ఎలాంటి స్పందన రాలేదు. సెప్టెంబర్ 25న కంపెనీ టీంనుంచి స్పందన వచ్చింది. కేవలం 5 వేల రూపాయలు కట్టి కారును తీసుకెళ్లమని టీం తెలిపింది. దీంతో గణేష్ 26వ తేదీన వాళ్లు చెప్పినంత డబ్బులు కట్టి తన కారును వెనక్కు తెచ్చుకున్నాడు. తన కారు రిపేర్కు సంబంధించిన అనుభవాన్ని తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు. ప్రస్తుతం గణేష్ పోస్టు వైరల్గా మారింది. వందల సంఖ్యలో షేరింగ్లు.. వేల సంఖ్యలో లైకులు, కామెంట్లు వస్తున్నాయి.