రైలు బోగీలకు రెండు వైపులా కిటికీలు, తలుపులు ఉంటాయి. అయితే కిటికీలు, తలుపులు లేని రైళ్లు కూడా ఉంటాయి. మీరు ఎప్పుడైనా గమనించారా? కొన్ని రైళ్ల బోగీలకు కిటికీలు గానీ, తలుపులు గానీ ఉండవు. ఏక చెక్క అన్నట్టు పూర్తిగా క్లోజ్ చేసి ఉంటుంది. చూడ్డానికి ప్యాసింజర్ రైలులా కనిపిస్తున్న ఈ రైలుకు కిటికీలు, తలుపులు ఉండకపోవడానికి కారణం ఉంది. ఈ రైళ్లను ఎన్ఎంజీ రైళ్లు అని అంటారు. ఎన్ఎంజీ అంటే న్యూ మాడిఫైడ్ గూడ్స్ అని అర్థం. ప్యాసింజర్ రైళ్లను న్యూ మాడిఫైడ్ గూడ్స్ రైళ్లుగా మార్చుతారు. ప్యాసింజర్ బోగీని ఎన్ఎంజీ కోచ్ గా మార్చిన అనంతరం 5 నుంచి పదేళ్ల పాటు వినియోగిస్తారు. దీన్ని గూడ్స్ రైలులా ఉపయోగిస్తారు.
ఆల్రెడీ గూడ్స్ రైళ్లు ఉన్నప్పుడు వీటిని ఎందుకు ప్రత్యేకించి గూడ్స్ రైలుగా మార్చడం అని మీకు సందేహం రావచ్చు. అయితే మామూలు గూడ్స్ బండికి, దీనికి చాలా తేడా ఉంది. గూడ్స్ రైలుబండ్లు కొన్ని ఓపెన్ లో ఉంటే, మరికొన్ని మొత్తం క్లోజ్ చేసి ఉంటాయి. అయితే వీటిలో బొగ్గు, చమురు వంటివి తరలిస్తూ ఉంటారు. అయితే ఈ ప్యాసింజర్ కోచ్ ని తలుపులు, కిటికీలు లేకుండా చేసి దేని కోసం ఉపయోగిస్తారు అని అంటే.. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వాహనాలను రవాణా చేసేందుకు ఈ రైళ్లను ఉపయోగిస్తారు. కార్లు, ట్రాక్టర్లు, బైకులు వంటి వాహనాలను ఇందులో రవాణా చేస్తారు. మరి వాహనాలకు భద్రత ఇవ్వాలి కాబట్టి ఆ కోచ్ లకు కిటికీలు, తలుపులు లేకుండా పూర్తిగా మూసివేస్తారు.
ప్యాసింజర్ కోచ్ ని ఎన్ఎంజీ కోచ్ గా మార్చేటప్పుడు లోపల ఉన్న సీట్లను తొలగించి పూర్తిగా సీల్ చేస్తారు. అయితే ప్యాసింజర్ కోచ్ ని తయారు చేసిన 20 నుంచి 21 ఏళ్ల తర్వాత సాధారణ ప్రయాణికుల అవసరాలకు ఉపయోగించకుండా ఆటో క్యారియర్ గా మార్చేస్తారు. అంటే ఆటోమొబైల్ వాహనాలను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించడానికి ఇలా మారుస్తారు. వీటినే న్యూ మాడిఫైడ్ గూడ్స్ గా పిలుస్తారు. చిన్న కార్ల నుంచి ట్రాక్టర్లు, మినీ ట్రక్కులు వంటి వాటిని ఇందులో ఎక్కించి తరలిస్తారు. కోచ్ వెనక భాగంలో మాత్రం ఒక తలుపు ఉంటుంది. ఆ తలుపు నుంచి వాహనాలను ఎక్కించడం, దింపడం చేస్తుంటారు.