తెలంగాణలో రాజకీయాలు అంతకంతకు రసవత్తరంగా మారుతున్నాయి. క్షణం క్షణం ఓ కొత్త ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. నిన్న తనపై జరిగిన దాడికి నిరసనగా మంగళవారం వైఎస్ షర్మిల ప్రగతి భవన్కు కారులో బయలు దేరిన సంగతి తెలిసిందే. ఆమెను పోలీసులు పంజాగుట్ట వద్ద అడ్డుకున్నారు. కారులో ఉన్న ఆమెను కారుతో సహా క్రేన్తో లిఫ్ట్ చేసి తీసుకెళ్లిపోయారు. ఆమెపై పలు సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే కూతుర్ని కలవటానికి సిద్ధమైన వైఎస్ విజయమ్మను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ప్రస్తుతం షర్మిల ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్లో ఉన్నారు.
షర్మిలను కలిసేందుకు విజయమ్మ ఎస్సార్ నగర్ వెళ్లటానికి సిద్ధమయ్యారు. అయితే, పోలీసులు ఆమెను బయటకు వెళ్లనివ్వలేదు. లోటస్ పాండులోని ఆమె ఇంట్లోనే ఆమెను హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో విజయమ్మ ఆవేదనకు గురయ్యారు. పోలీసుల తీరుకు నిరసనగా ఇంట్లోనే నిరాహార దీక్షకు పూనుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ నా కూతుర్ని చూడటానికి వెళుతుంటే ఎందుకు ఆపుతున్నారు. పాదయాత్ర చేయటం రాజ్యాంగ విరుద్ధమా.. పోలీసులు ఇలా చేయటం తప్పుకాదా’’’ అని ప్రశ్నించారు.
కాగా, షర్మిల అరెస్ట్పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వ్యక్తిగతంగా షర్మిల అరెస్ట్ బాధాకరమన్నారు. తమది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని, ఆమెది వైఎస్సార్ తెలంగాణ పార్టీ అని అన్నారు. ఆ పార్టీ తెలంగాణలో ఉందని అన్నారు. రాజకీయపరమైన విషయాల్లో తాము కామెంట్లు చేయటం కరెక్ట్ కాదని స్పష్టం చేశారు.