ఎంత సైన్స్ నమ్మినా సరే.. అప్పుడప్పుడు దేవుడిని కూడా నమ్మే పరిస్థితులు ఎదురవుతుంటాయి. ఇప్పుడు కూడా సేమ్ అలాంటి సంఘటనే జరిగింది. సరిగ్గా వినాయక చవితి ముందురోజు.. ఓ పురాతన గణేశుడి విగ్రహం తవ్వకాల్లో బయటపడింది. ఇంతకీ అసలు ఏం జరిగింది?
ఇక వివరల్లోకి వెళ్తే.. నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం, పరడ గ్రామ శివార్లలో గుట్టమీద కొత్త రాతియుగం, ఇనుపయుగపు ఆనవాళ్లు, గుట్ట దిగువన తూర్పు వైపున బౌద్ధ స్థూప శిథిలాలను పురవస్తు శాఖ అధికారులు పరిశీలిస్తుండగా.. కాకతీయుల కాలానికి చెందిన వినాయకుడి అతి చిన్న రాతి విగ్రహం వెలుగు చూసింది. ఇదే విషయాన్ని పురవస్తు విశ్రాంత అధికారి, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి వెల్లడించారు.
‘కాకతీయుల కాలం అంటే 13వ శతాబ్దానికి చెందిన ఈ రాతి విగ్రహం 4 సెంటీమీటర్ల ఎత్తు, 3 సెంటీమీటర్ల వెడల్పు ఉంది. తలపైన కాకతీయ శైలి జటామకుటం, ఎడమ వైపు తిరిగి ఉన్న తొండం, చేతుల్లో దంతం, మోదకం, బొజ్జమీదుగా నాగయజ్ఞోపవీతం ఉన్న ఈ వినాయకుడు లలితాసన భంగిమలో కూర్చుని ఉన్నాడు. మెత్తడి రాతితో చెక్కిన ఈ విగ్రహం అప్పట్లో ఇళ్లలో పూజలందుకుని ఉంటుంది. నాటి ఊరు కాలగర్భంలో కలిసిపోయాక విగ్రహం కూడా మట్టిలోనే ఉండిపోయింది. గతంలో కర్నూలు జిల్లా వీరాపురంలో క్రీ.శ. 3వ శతాబ్దికి చెందిన ఇదే పరిమాణంలో ఉన్న మట్టి వినాయకుడి విగ్రహం, కీసరగుట్టలో 5వ శతాబ్దానికి చెందిన గణేశుడి రాతి శిల్పం బయటపడ్డాయి. ఇప్పుడు కాకతీయ కాలానికి చెందిన ఇప్పటివరకు వెలుగు చూసిన వాటిల్లో అతి చిన్న విగ్రహాన్ని గుర్తించాం’ అని శివనాగిరెడ్డి పేర్కొన్నారు.
ఔత్సాహిక పరిశోధకులతో కలిసి జరిపిన ఈ అన్వేషణలో ఈ విగ్రహం కనిపించిందని, వినాయకచవితి ముందురోజే ఈ విగ్రహం వెలుగు చూడటం విశేషమని ఆయన అన్నారు. సరిగ్గా వినాయక చవితి ముందురోజు.. ఇలా పురాతన గణపతి విగ్రహం వెలుగు చూడటం గురించి మీరేం అనుకుంటున్నారు. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇది కూడా చదవండి: వినాయక చవితి నాడు చంద్రుడిని చూస్తే ఏమవుతుంది?