భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు వెంకటాపురం ఏరియా కమిటీ పేరిట లేఖ విడుదల చేశారు. ములుగు జిల్లాలో వెంకటాపురం మండలం సూరవీడు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కోర్స రమేష్ ను చంపివేసినట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. పోలీసులకు ఇన్ ఫార్మర్గా పనిచేస్తున్నాడనే కారణంతో చంపేసినట్లు మావోలు లేఖ విడుదల చేశారు. ఛత్తీస్ గఢ్ తెలంగాణ సరిహద్దుల్లోని అడవుల్లో రమేష్ ను హతమార్చినట్లు మావోయిస్టులు పేర్కొన్నారు.
ములుగు జిల్లా వెంకటాపురం మండలం సూరవీడుకు చెందిన మాజీ సర్పంచ్ కొర్స రమేష్ ను సోమవారం సాయంత్రం కిడ్నాప్ చేశారు మావోయిస్టులు. దీంతో స్థానికంగా అలజడి రేగింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. అతడి ఆచూకీ కోసం ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో కిడ్నాప్ చేసిన రమేష్ ను హతమార్చినట్లు అధికారికంగా లేఖ విడుదల చేశారు. ఓ వైపు పోలీసులకు ఇన్ ఫార్మర్ గా ఉంటూనే.. మావోలకు సానుభూతిపరునిగా నటించి మోసం చేశాడని పేర్కొన్నారు. 2019లో రమేష్ పోలీస్ ఇన్ఫార్మర్గా మారి పాలపొడిలో విషం కలిపి ఇచ్చాడని మావోయిస్టులు ఆరోపిస్తున్నారు. ఆ పాలపొడి వల్ల కొంతమంది మావోలు అనారోగ్యం బారినపడ్డారని, మ్యాదరి బిక్షపతి అలియాస్ విజేందర్ అమరుడయ్యాడని తెలిపారు. అంతేకాకుండా ఒక ఎన్ కౌంటర్ కు కూడా రమేష్ కారణమని.. అందుకే అతన్ని కిడ్నాప్ చేసి చంపామని మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు.
ఇది చదవండి : గాలిపటంలా గాలిలో ఎగిరిన కుర్రాడు.. వీడియో వైరల్!
రమేష్ స్వగ్రామం ములుగు జిల్లా వెంకటాపురం మండలం సూరవీడు పంచాయతీ పరిధిలోని కే కొండాపురం. 2014లో సర్పంచ్గా ఎన్నికైన రమేష్.. ప్రస్తుతం లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. పార్టీకి, ప్రజలకు ద్రోహం తలపెట్టడంతోనే ప్రజాభిప్రాయం మేరకు రమేష్ను హత్య చేశామని తెలిపారు. పోలీసులు ఇచ్చే డబ్బులకు ఆశపడి ఇన్ఫార్మర్గా మారితే రమేష్కు పట్టిన గతే పడుతుందని మావోయిస్ట్ పార్టీ వెంకటాపురం వాజేడు ఏరియా కమిటీ కార్యదర్శి శాంత హెచ్చరించారు.