దేశంలో ఒకప్పుడు లింగమార్పిడి చేసుకున్న వారికి సమాజంలో ఎలాంటి గౌరవం లేకుండా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉండేవారు. గతంలో వారికి ఎలాంటి గుర్తింపు.. సౌకర్యాలు ఉండేవి కావు. ఈ క్రమంలో తాము సమాజంలో మనుషులమే అంటూ పోరాటాలు చేస్తూ వస్తున్నారు ట్రాన్స్ జెండర్లు. ఇటీవల ట్రాన్స్ జెండర్ల కోసం కష్టాలపై ప్రభుత్వాలు దృష్టి సారిస్తున్నాయి.. సమాజంలో వారికి ఒక గుర్తింపు ఉండేలా చర్యలు తీసుకుంటున్నాయి. ఈ మద్య ట్రాన్స్ జెండర్ల కోసం ప్రత్యేక క్లీనిక్ ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. తాజాగా మరో అడుగు ముందుకు వేసి ఇద్దరు ట్రాన్స్ జెండర్లకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించి సరికొత్త చరిత్రకు నాంధి పలికింది తెలంగాణ ప్రభుత్వం. దీనిపై ట్రాన్స్ జెండర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గత కొంత కాలంగా తెలంగాణలో డాక్లర్లు గా ఉంటున్న ప్రాచీ రాథోడ్, రూత్ జాన్ పాల్ కొయ్యాల ఇద్దరు ట్రాన్స్ జెండర్స్ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాలు సంపాదించారు. తెలంగాణ చరిత్రలో తొలిసారి ఇద్దరు ట్రాన్స్జెండర్స్ ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన ఘనత దక్కించుకున్నారు. ఈ ఇద్దరు ఉస్మానియా హాస్పిటల్ లో మెడికల్ ఆఫీసర్స్ గా నియమితులయ్యారు. ఇది ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీలో ఒక గొప్ప విజయం అని అంటున్నారు.. ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు ప్రాచీ రాథోడ్, రూత్ జాన్ పాల్ కొయ్యాల.
ఈ ఉద్యోగాలు ఆ ఇద్దరికీ అంత సులువుగా వచ్చినవేమీ కాదని అంటున్నారు. ఈ సందర్భంగా రూత్ జాన్ పాల్ మాట్లాడుతూ.. ‘ 2018లో నా గ్రాడ్యూయేషన్ పూర్తయ్యింది.. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటే ఎంతోమంది ఆస్పత్రివర్గాల వారు నన్ను తిరస్కరించారు. కేవలం ట్రాన్స్ జెండర్ కావడం వల్లనే వాళ్లు నన్ను తిరస్కరిస్తున్నారన్న విషయం తెలిసింది. నా విద్యార్హత చూడకుండా కేవలం నా ఐడెంటిటీనే పరిగణలోకి తీసుకొని నాకు ఉద్యోగం ఇవ్వడారినికి నిరాకరించినట్లు నాకు స్పష్టంగా అర్థమైంది.. ఇప్పుడు నాకు ప్రభుత్వ ఉద్యోగం రావడం చాలా సంతోషంగా ఉంది.. ఇది నా కమ్యూనిటికీ తలెత్తుకునే విషయం.. వాస్తవానికి ఇంత గొప్ప అవకాశం నేను దక్కించుకుంటానని ఊహించలేదు.. తెలంగాణ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం’ అంటూ రూత్ జాన్పాల్ చెప్పుకొచ్చింది.
ఇక ప్రాచీ రాథోడ్ మాట్లాడుతూ.. ‘నేను నా జీవితంలో ఎన్నో పరాభవాలను ఎదుర్కొన్నాను.. ఆదిలాబాద్ రీమ్స్ లో ఎంబీబీఎస్ చేశాను. ఓ ప్రైవేల్ హాస్పిటల్ లో పనిచేశాను.. నా ఐడెంటిటీ తెలిసిన నన్ను ఉద్యోగం నుంచి తొలగించారు. నేను ట్రాన్స్ జెండర్ అని తెలిస్తే.. హాస్పిటల్ కి వచ్చే పేషెంట్లు వేరే రకంగా భావిస్తారని.. వారి సంఖ్య తగ్గిపోతుందని ఆసుపత్రి వర్గాలు నాకు తెలిపాయి. ఇది నాకు ఎంతో ఆవేదన కలిగించింది. ఇలా తామిద్దరం తిరస్కరణకు గురైన తర్వాత 2021 లో ట్రాన్స్ జెండర్ క్లీనిక్ లో చేరాం.. దేవుడి దయవల్ల ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించుకున్నాం’ అంటూ సంతోషం వ్యక్తం చేసింది ప్రాచీ రాథోడ్.