తెలంగాణలో వెలుగు చూసిన పేపర్ లీకేజ్ వ్యవహారంలో రోజుకో ట్విస్ట్ షాకిస్తోంది. దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గ్రూప్-1 ప్రిలిమ్స్ పేపర్ లీకయినట్లు తెలిసింది. తాజాగా దీనిపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారం తెలంగాణలో పెను ప్రకంపణలు సృష్టిస్తోంది. ఈ వ్యవహారంపై నిరుద్యోగులు, విద్యార్థులతో పాటు.. ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ వ్యవహారం.. రాజకీయ రంగు పులుముకుంది. పేపర్ లీకేజీ వ్యవహారంపై ప్రతిపక్ష నేతలంతా ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రూపు-1 ఫలితాలల్లో నమ్మలేని నిజాలు బయటకు వస్తున్నాయంటూ బండి సంజయ్ బాంబు పేల్చారు. గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతల పిల్లలు, బంధువులంతా క్వాలిఫై అయ్యారని ఆరోపించారు. అంతేకాక ఒకే మండలం నుంచి 50 మందికి పైగా క్వాలిఫై అయ్యారని సంచలన విషయాలు వెల్లడించారు. మరోవైపు.. ఒక చిన్న గ్రామంలో ఆరుగురు అభ్యర్థులు గ్రూప్-1 ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారన్నారు. ఈ పరిణామాలన్నింటింకీ మంత్రి కేటీఆరే ప్రధాన బాధ్యుడంటూ బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు.
ఇక గ్రూప్-1 ప్రిలిమ్స్ క్వాలిఫై అయినవారిలో నలుగురు బీఆర్ఎస్ సర్పంచుల కొడుకులు, సింగిల్ విండో ఛైర్మన్ కొడుకుతో పాటు ఒక జడ్పీటీసీ బాడీగార్డ్ కొడుకు కూడా ఉన్నారని వెల్లడించారు బండి సంజయ్. ఒక సర్పంచ్ కుమారుడికి అర్హతలు లేకున్నా దొడ్డిదారిన క్వాలిఫై చేశారని ఆరోపించారు. ఇదంతా కేసీఆర్ కొడుకు కేటీఆర్ కనుసన్నల్లోనే జరిగింది. ఇందుకు ఒక్కొక్కరి దగ్గర నుంచి 3 నుండి 5 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు తమకు సమాచారం తెలిసింది అంటూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు బండి సంజయ్.
అంతేకాక ఈ వ్యవహారంపై సీఎం కేసీఆర్ నియమించిన సిట్.. ఎలా పారదర్శకంగా విచారణ చేయగలదని బండి సంజయ్ ప్రశ్నించారు. నయీం కేసు, డ్రగ్స్ కేసుల్లాగానే.. ఈ పేపర్ లీకేజీ కేసును కూడా సిట్కు అప్పగించి పక్కదారి పట్టించే ప్రయత్నం జరుగుతోందంటూ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సిట్టింగ్ జడ్జి విచారణతోనే నిజాలు బయటకొస్తాయని.. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. అంతేకాక పేపర్ లీకేజీ కేసుకు సంబంధించి మంత్రి కేటీఆర్ను బర్తరఫ్ చేయాల్సిందేనని డిమాండ్ చేశారు.
మరోవైపు.. ఈ కేసు విచారణలో భాగంగా సిట్ అధికారులు నిందితులను కస్డడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. రెండో రోజు కస్టడీలో భాగంగా 9 మంది నిందితులను 7 గంటల పాటు విచారించారు అధికారులు. ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడు రాజశేఖర్ పాత్రపై కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నట్లు తెలుస్తోంది. నిందితుల పరిచయాలు, బ్యాంక్ లావాదేవీలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రధాన నిందితులైన రాజశేఖర్, ప్రవీణ్, రేణుకను విడివిడిగా ప్రశ్నించారు. నిందితుల వాట్సప్ చాటింగ్ని రిట్రీవ్ చేయగా.. కొత్త లింకులు బయటడినట్టు తెలుస్తోంది. ఆ వాట్సప్ చాటింగ్ను నిందితుల ముందు పెట్టి అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ కేసులో మరిన్ని సంచలనాలు బటయకు వచ్చే అవకాశం ఉంది. మరి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.