ఇప్పటికే పెరిగిన ఇంధన, నిత్యవసర, కూరగాయల ధరలతో అల్లాడుతున్న ప్రజలపై మరో భారం మోపేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమయ్యింది. రాష్ట్రంలో మరో సారి రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచేందుకు సర్కార్ సిద్ధమవుతోంది. ఈ క్రమంలో వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల మూల మార్కెట్ విలువల్ని సవరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త మార్కెట్ విలువలు ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిసింది.
ప్రాథమిక సమాచారం ప్రకారం వ్యవసాయ భూముల మార్కెట్ విలువల్ని 50 శాతం, ఖాళీ స్థలాల విలువను 35 శాతం, అపార్టుమెంట్ల విలువను 25 శాతానికి పెంచాలని నిర్ణయించింది. దీంతో పాటు బహిరంగ మార్కెట్ లో విలువలు భారీగా ఉన్న చోట అవసమైన మేరకు సవరించేందుకు అవకాశం కల్పించనుంది. ఈ మేరకు నాలుగైదు రోజుల్లో ఆర్డీవోల నేతృత్వంలోని కమిటీలు కొత్త మార్కెట్ విలువల్ని ఖరారు చేయాలని నిర్ణయించిటనట్లు తెలిసింది. ఫిబ్రవరి 1 నుంచి కొత్త మార్కెట్ విలువలు అమల్లోకి వచ్చేలా వార రోజుల్లో పెంపు కార్యచరణ వేగవంతం చేయాలని రిజిస్ట్రేషన్ శాఖ నిర్ణయించింది.
పెంచి ఏడాది గడవక ముందే..
గత ఏడాది వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల మార్కెట్ విలువతో పాటు రిజిస్ట్రేషన్ ఛార్జీలు, స్టాంపు రుసుంలను ప్రభుత్వం పెంచింది. దాదాపు 20 శాతం మేర వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల మూల మార్కెట్ విలువలను సవరించింది. తాజాగా మరోమారు పెంచనుంది. మార్కెట్ విలువ, వ్యవసాయేతర ఆస్తుల విలువల పెంపుపై గురువారం రిజిస్ట్రేషన్ శాఖ కీలక సమావేశాన్ని నిర్వహించింది.
స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ శేషాద్రి, సంయుక్త ఐజీలు జిల్లా రిజిస్ట్రార్లతో సుదీర్ఘంగా నిర్వహించిన సమావేశాల్లో మార్కెట్ విలువల్ని ఏ మేరకు సవరించాలన్న విషయమై కసరత్తు నిర్వహించారు. ఒకట్రెండు రోజుల్లో ప్రతిపాదనలకు తుది రూపు ఇచ్చి ప్రభుత్వానికి అందజేయనున్నారు. సర్కారు నిర్ణయం మేరకు మార్కెట్ విలువల్ని సవరించి, అమలు చేయనున్నట్లు సమాచారం.
గత ఏడాది జులై 22 నుంచి సవరించిన భూముల విలువ, పెరిగిన రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమలు లోకి వచ్చాయి. వ్యవసాయ భూముల కనీస ధర ఎకరం 75 వేలుగా నిర్ణయించిన ప్రభుత్వం.. తక్కువ విలువ ఉన్న భూమి మార్కెట్ రేటును 50 శాతం పెంచగా.. మధ్య శ్రేణి భూముల విలువను 40 శాతం, ఎక్కువ విలువ ఉన్న భూమి ధరను 30 శాతం మేర పెంచింది.
అదే విధంగా ఖాళీ స్థలాల కనీస ధర చదరపు గజానికి రూ. 200 గా నిర్ణయించింది. వీటి విలువను కూడా 50 శాతం, 40 శాతం, 30 శాతంగా పెంచింది. అపార్టుమెంట్ల ధరల్లో చదరపు అడుగు కనీస ధర రూ. వేయిగా నిర్ణయించగా కనిష్ఠంగా 20 నుంచి గరిష్ఠంగా 30 శాతం పెంచారు. దీంతో పాటు స్టాంపు డ్యూటీ విలువ, రిజిస్ట్రేషన్ల రుసుంలను సర్కారు పెంచింది.