ఎక్కడొ పుట్టి.. ఎక్కడొ పెరిగి పెళ్లి అనే రెండు అక్షరాల వేడుకతో రెండు మనసులు ఒకటవుతాయి. ఒకరికొకరు తోడుగా జీవితాంతం కలిసి జీవిస్తుంటారు. మరీ ముఖ్యంగా భార్యలు.. భర్తనే సర్వస్వంగా భావిస్తుంటారు. అతని ఆరోగ్యం కోసం పూజలు, వ్రతాలు చేస్తుంటారు. అలానే భర్త ప్రాణాల కోసం తమ ప్రాణాలను కోల్పోయిన భార్యలు ఎందరో ఉన్నారు. భర్త ప్రాణాలను కాపాడేందుకు సతీసావిత్రిలా తెగించే వాళ్లు నేటికాలంలో కూడా చాలా మంది ఉన్నారు. అలానే తాజాగా ఓ మహిళ.. గుండె పోటు వచ్చి.. కుప్పకూలిన తన భర్త ప్రాణాలు కాపాడుకునేందుకు తీవ్రంగా పోరాడింది. కానీ చివరకు భర్త ప్రాణాలను కాపాడుకోలేకపోయింది. ఈ హృదయవిదారక ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం రేకులపల్లి గ్రామానికి చెందిన సాగర్(40), వాసవి భార్యాభర్తలు. సాగర్ ట్యాక్సీ నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. అలానే వాసవి కూడా అదే గ్రామంలో ఆశా కార్యకర్తగా విధులు నిర్వహిస్తుంది. సోమవారం ఉదయం వాసవికి సిరికొండ పీహెచ్ సీలో సమావేశం ఉంది. దీంతో సాగర్ తన భార్యను తీసుకుని ద్విచక్రవాహనంపై సిరికొండ పీహెచ్ సీ కి తీసుకెళ్లారు. సమావేశం ముగిసిన అనంతరం ఇద్దరు తిరిగి ఇంటికి బయలు దేరారు. ఈక్రమంలో సిరికొండ మండలం కొండూరు గిర్ని చౌరస్తాలో రాగానే భార్యను దించి.. సాగర్ పెట్రోల్ కోసం బంక్ వైపు వెళ్లారు.
అలా కొంచెం ముందుకు వెళ్లాగానే ఒక్కసారిగా స్పృహతప్పి బైక్ పై నుంచి పడిపోయారు. గుండెపోటు వచ్చినట్లు వాసవి గుర్తించింది. దీంతో వెంటనే సీపీఆర్ చేసి భర్తను కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. చాలా సేపు భర్తకు వాసవి సీపీఆర్ చేస్తూ స్పృహలోకి తెచ్చే ప్రయత్నం చేసింది. ఈలోపు సమాచారం అందుకున్న 108 వాహనం అక్కడికి చేరుకుని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లింది. అక్కడ సాగర్ ను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. భర్త మరణంతో వాసవి గుండెలు పగిలేలా రోదించారు. సాగర్ మరణంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. భర్త ప్రాణాలు కాపాడేందు వాసవి ఎంత ప్రయత్నం చేసిన ఫలితం లేకుండా పోయింది.