కొంతమందికి ధైర్యం అంటే ఏమిటో అని అర్ధం తెలియని వయస్సులోనే దాన్ని ప్రదర్శిస్తుంటారు. అచ్చం అలానే ఓ నాలుగో తరగతి చదువుతోన్న చిన్నారి ధైర్యాన్ని ప్రదర్శించింది. తమ పాఠశాలలో మధ్యాహ్నం భోజనంలో జరుగుతున్న అవినీతిపై గళమెత్తింది. అన్యాయాన్ని ఎత్తి చూపుతూ ఏకంగా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. తాము తినే మధ్యాహ్న భోజనంలో పురుగులు, రాళ్లు వస్తున్నయంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అన్నంలో పురుగుల రావడంపై అడిగితే ఉపాధ్యాయులు బెదిరిస్తున్నారంటూ..ఏ మాత్రం భయపడకుండా పోలీసుల ఎదుట వివరించింది. పాఠశాలలో అందరూ మౌనంగా ఉన్న..ఆ చిన్నారి మాత్రం ధైర్యంగా ముందుకు వచ్చి.. ఫిర్యాదు చేయటం పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
రంగారెడ్డి జిల్లాలోని మీర్ పేట్ లోని సిర్లాహిల్స్ కు చెందిన పూజిత స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 4వ తరగతి చదువుతోంది. అయితే మంగళవారం పాఠశాలలో మధ్యాహ్నం భోజనం చేస్తుండగా పూజిత ప్లేట్ లో పురుగులు వచ్చాయి. దీంతో అన్నంలో పురుగులు, రాళ్లు వచ్చాయంటు పూజిత ఉపాధ్యాయులకు ఫిర్యాదు చేసింది. ‘ఎవరికి రాని పురుగులు నీకే వస్తాయా?, ఇక్కడ అన్నం తినకపోతే టీసీ ఇచ్చి పంపిచ్చేస్తాము’ అని తమ టీచర్లు బెదిరించారని పోలీసుల ఫిర్యాదులు పూజిత తెలిపింది. పాఠశాలలో చాలా మంది పిల్లలే చదువుకుంటున్న మధ్యాహ్నం భోజనంలో వస్తున్న పురుగులు, రాళ్ల విషయంపై ఎవరు మాట్లాడలేదు. బుధవారం పూజిత ధైర్యంగా తన తల్లి రాణితో మీర్ పేట్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి సీఐ మహేందర్ రెడ్డికి ఫిర్యాదు చేసింది.
పూజిత ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు పాఠశాల మధ్యాహ్న భోజనం తనిఖీలు చేయాలని ఆదేశించాడు. దీంతో ఏఎస్ఐ తిరపతయ్య పాఠశాలకు వెళ్లి వంటగదిని తనిఖీ చేశారు వారం కూరగాయాలు పాడైపోయి ఉండడం, బియ్యం కూడా నాణ్యతగా లేకపోవడాన్ని పోలీసులు గుర్తించారు. ఇటువంటి ఆహారం విద్యార్థులకు ఎలా పెడుతున్నారని ప్రధానోపాధ్యాయులను ప్రశ్నించారు. ఈ విషయంపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని వివరణ కోరగా అలాంటిది ఏమిలేదని, పూజిత రెండు రోజుల నుంచి పాఠశాలకు రావడం లేదని తెలిపారు. అన్నంలో పురుగులు, రాళ్లు వస్తున్నట్లు పూజిత పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసినట్లు మండల విద్యాధికారి దృష్టికి వెళ్లింది. దీంతో ఆయన వెంటనే మీర్ పేట్ లోని ప్రాథమిక పాఠశాలకు వెళ్లి తనిఖీ చేశారు.
అయితే కూరగాయాలు, బియ్యం నాణ్యంగానే ఉన్నాయని, అయితే ఆ విద్యార్ధినిని ఉపాధ్యాయుల బెదిరించినట్లు వస్తున్న ఆరోపణలపై వాస్తవాలు ఏంటనేది తెలియాల్సి ఉందన్నారు. మధ్యాహ్నం వరకే ఉండటంతో పిల్లల ఇళ్లకు వెళ్లిపోయారని, గురువారం విచారణ చేపడతామని ఆయన తెలిపారు. ఇక ఈ విషయం పక్కన పెడితే ..పూజితపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అంత చిన్న వయస్సులో పోలీస్ స్టేషన్ కి వెళ్లి సమస్యపై ఫిర్యాదు చేయడం అందరిని ఆశ్చర్య పరిచింది. ఈ పాప భవిష్యత్ లో గొప్ప నాయకురాలు అవుతుందిని కొందరు అభిప్రాయ పడ్డారు. భయానికి మీనింగ్ తెలియని ఈ చిన్నారి.. భవిష్యత్ లో మరెన్నో సమస్యలకు పరిష్కారం చూపిస్తుందని మరికొందరు అంటున్నారు.