నేటికాలంలో కూడా ఆడపిల్లలు పుడితే భారం అనుకునే వారు చాలా మంది ఉన్నారు. కొందరు మాత్రం ఆడపిల్లలు ఇంటికి వెలుగులా భావిస్తారు. వారిని ఎంతో ఉన్నత చదువులు చదివించాలని కోరుకుంటారు. అయితే కొందరు మాత్రం పేదరికం కారణంగా తమ కుమార్తెలను చదివించకుండా పెళ్లిళ్లు చేసి అత్తగారింటికి పంపిస్తుంటారు. అలా ఎందరో చదువుల సరస్వతులు వెలుగులోకి రాకుండా ఉండిపోతున్నారు. తాజాగా ఓ గొర్రెల కాసుకునే ఓ వ్యక్తి కుటుంబంలోనూ ఇదే పరిస్థితి ఏర్పడింది. ఆయనకు ముగ్గురు కుమార్తెలు ఉండగా ఇప్పటికే పెద్ద అమ్మాయిని ఆర్ధిక పరిస్థితి బాగాలేక చదువు మాన్పించాడు. ఇప్పుడు రెండు కుమార్తెకి కూడా అలాంటి పరిస్థితే ఏర్పడింది. హార్టీసెట్ పరీక్షలో రాష్ట్ర స్థాయిలో మూడో ర్యాంకు సాధించింది. అయినప్పటికీ ఫీజు కట్టలేని పేదరికంలో ఆ తండ్రి ఉన్నాడు. బిడ్డలు తెలివైన వారు అయినప్పటికి తన పేదరికంతో వారి లక్ష్యాలు నెరవేరడం లేదని ఆ తల్లిదండ్రులు తీవ్ర వేదన చెందుతున్నారు.
తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం కోనాయిపల్లికి చెందిన గొల్ల చిన్నోళ్ల స్వామి, నాగమణి దంపతులు గొర్రెలను పెంచుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ముగ్గురు అమ్మాయిలు. ఈ దంపతులు ఇద్దరు నిత్యం గొర్రెలను కాయడంతో పాటు కూలీ పనులు చేసుకుంటూ పిల్లలను చదవిస్తున్నారు. వీరి పెద్ద కూతురు కల్యాణి 2020లో అగ్రికల్చర్ డిప్లొమా పూర్తి చేసింది. చదువులో ఎప్పుడూ ముందే కల్యాణి.. 60 మంది ఉన్న వారి బ్యాచ్ లో టాపర్ గా నిలిచింది. ఉన్నత చదువులకు వెళ్లాలని బలంగా కోరుకునేది. అదే విషయాన్ని తన తల్లిదండ్రులతో చెప్పింది. అయితే వారు తమ ఆర్ధిక స్థితి సరిగ్గా లేక బిడ్డను ఉన్నత చదువులకు పంపే విషయంలో తీవ్ర మనోవేదన చెందారు.
తమకు అంత స్థోమత లేదని కుమార్తెకు తెలిపారు. అలానే కల్యాణి కూడా ఉన్న ఇంట్లో ఆర్ధిక సమస్యల గమనించింది. ఇప్పటికే తల్లిదండ్రులు తమ మగ్గురు అక్కాచెల్లెళ్ల కోసం రేయింబవళ్లు కష్టపడి చదివించారు. ఇక్కవారిని కష్టపెట్టడం తనకు ఇష్టంలేదని భావిచింది. తన ఇష్టాలను, లక్ష్యాలను వదిలేసి ఇంటికే పరితమైంది. కుట్టుమిషన్ పని నేర్చుకొని తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటుంది. తాజాగా చిన్నోళ్ల స్వామి రెండో కుమార్తె స్రవంతి కూడా అలాంటి ఇబ్బందే ఎదుర్కొంటుంది. స్రవంతి కూడా అగ్రికల్చర్ డిప్లొమా పూర్తిచేసింది. డిగ్రీ(హార్టీ కల్చర్) చదవాలని స్రవంతి బలంగా అనుకుంది. ఈ క్రమంలో హార్టీసెట్ పరీక్షలో మంచి ర్యాంకు సంపాదించాలనే పట్టుదలతో కష్టపడి చదివింది.
ఈక్రమంలో ఇటీవల రాసిన హార్టీసెట్ పరీక్షలో రాష్ట్ర స్థాయిలో మూడో ర్యాంకు సాధించింది. డిసెంబర్ 5న కౌన్సిలింగ్ హాజరు కావాల్సి ఉంది. ఈ కౌన్సిలింగ్ లో సీటు దక్కాలంటే అదే రోజు రూ.50 వేలు చెల్లించాలి. అలానే నాలుగేళ్ల ఈ డిగ్రీ కోర్సును పూర్తి చేయలంటే దాదాపు రూ.4 లక్షల వరకు ఖర్చు అవుతుంది. స్రవంతి చదువు కోసం ఇంతమొత్తంలో ఖర్చు పెట్టే స్థోమత వారి కుటుంబానికి లేదు. పెద్ద అమ్మాయిని కూడా ఇదే కారణంతో చదువు మాన్పించిన సంగతి గుర్తు చేసుకున్నారు. పదో తరగతిలోను స్రవంతి 10/10 పాయిట్లు సాధించింది. కుటుంబాన్ని పేదరికం వేధిస్తున్న ప్రభుత్వ కాలేజిలో చేరి.. పట్టుదలగా చదివి మంచి మార్కులు తెచ్చుకుంది.
ఇలా తాను కష్టపడి చదువుతున్న ఆర్ధిక పరిస్థితులు వెనక్కి నెట్టేస్తున్నాయని స్రవంతి బాధ పడుతోంది. ఉన్నతంగా రాణించాలనే కల ..కలగానే మిగిలి తాను ఇక నుంచి తండ్రితో కలిసి గొర్రెలు కాయడానికి వెళ్లక తప్పదని స్రవంతి ఆవేదన చెందుతుంది. దాతలు ఎవరైన సహృదయంతో స్పందించి.. ఆదుకుంటే ..తాను బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదుగుతానని ఆశగా చెబుతోంది. స్రవంతి కథ ఇలా ఉంటే ఆమె చెల్లి..ప్రస్తుతం ఆదర్శ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. మరి..ఆ పాపకు కూడా చదువులో బాగా రాణిస్తుంది.
పేదరికంలో పుట్టడమే తమకు శాపంగా ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు ఉండి చదువుకోకుండా జులాయి తిరిగే వారు ఒకవైపు అయితే చదువు మీదా ఎంతో ఆసక్తి ఉండి ఆర్ధిక పరిస్థితి బాగాలేక ఎందరో ఆడబిడ్డలు చదువులను అర్ధాంతరంగా ఆపేస్తున్నారు. స్రవంతి పరిస్థితిని చూసి వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరైన తమ కుమార్తె చదువుకు సాయం చేయాలని వారు కోరుతున్నారు. పేదరికంలో పుట్టి కూడా దాతల సాయంతో ఉన్నత స్థాయికి ఎదిగి.. సమాజానికి సేవలందించిన వారు ఎందరో ఉన్నారు. ఎవరైన సాయం అందిస్తే స్రవంతి కూడా ఉన్నత స్థాయికి వెళ్లి సమాజానికి సేవ చేస్తుందని స్థానికులు అంటున్నారు.