హైకోర్టు తీర్పు కారణంగా సోమేష్ కుమార్ ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు రిలీవింగ్ నేపథ్యంలో తెలంగాణ తదుపరి ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఎవరనేది ఉత్కంఠగా మారింది. సీఎస్ నియామకం విషయంలో సీఎం కేసీఆర్ ఏం చేస్తారనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. రాష్ట్ర కొత్త సీఎస్ రేసులో ముగ్గురు అధికారుల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. రాష్ట్ర కేడర్లో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో వసుధా మిశ్రా, రాణి కుముదిని, శాంతి కుమారి, శశాంక్ గోయల్, సునీల్ శర్మ, రజత్ కుమార్, రామకృష్ణారావు, అర్వింద్ కుమార్ ఉన్నారు.
పైఅధికారుల్లో వసుధా మిశ్రా, శశాంక్ గోయల్, అశోక్ కుమార్ కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు. సునీల్ శర్మ ఇంధనశాఖ, రజత్ కుమార్ నీటిపారుదల శాఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రామకృష్ణారావు ఆర్థిక శాఖ, అర్వింద్ కుమార్ పురపాలక శాఖ బాధ్యతల్లో ఉన్నారు. కొత్త సీఎస్ రేసులో రామకృష్ణారావు, అర్వింద్ కుమార్తోపాటు శాంతికుమారి పేర్లు బాగా వినిపిస్తున్నాయి. సీనియారిటీ ప్రకారం చూసుకుంటే.. సీఎస్ రేసులో 1987 బ్యాచ్ ఐఏఎస్ వసుధ మిశ్రా ముందంజలో ఉన్నారు. అయితే డిప్యుటేషన్పై యూపీఎస్సీ సెక్రటరీగా మంచి పదవిలో ఉండటం, మరో నెల రోజుల్లో పదవీ విరమణ చేయనుండటంతో ఆమె పోటీలో లేనట్లేనని చెప్పొచ్చు. రాష్ట్ర కార్మిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రాణికుముదిని (1988 బ్యాచ్)కు కూడా ఆరు నెలలకు మించి సర్వీసు లేదు.
సీనియారిటీతో సంబంధం లేకుండా తమకు నచ్చిన సీఎస్ను నియమించుకునే సంప్రదాయం దాదాపుగా అన్ని రాష్ట్రాల్లోనూ కొనసాగుతోంది. కాబట్టి గతంలో సీఎం ఆఫీసులో పని చేసిన శాంతికుమారి, రామకృష్ణారావు, అర్వింద్ కుమార్ల్లో ఒకరిని సీఎస్గా నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర ఆర్థిక శాఖ బాధ్యతలను సుదీర్ఘకాలంగా నిర్వహిస్తున్న రామకృష్ణారావు పనితీరుపై కేసీఆర్ సానుకూలంగా ఉన్నారని తెలుస్తోంది. ముక్కుసూటిగా వ్యవహరిస్తారనే పేరున్న అర్వింద్ కుమార్ కూడా అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో స్పెషల్ సీఎస్లుగా ఉన్న శాంతికుమారి, రామకృష్ణారావు, అర్వింద్ కుమార్ల్లో ఒకరిని సీఎస్గా నియమిస్తారని వినికిడి. పూర్తి స్థాయి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని నియమించాలా? లేదా ఇన్చార్జి సీఎస్ను నియమించాలా అనే దాని మీదా రాష్ట్ర ప్రభుత్వం పరిశీలన చేస్తున్నట్లు సమాచారం.