దశాబ్దాల పాటు విప్లవ రాజకీయాల్లో తన ఆట-పాటలతో తెలంగాణ ప్రజలను ఉత్తేజ పరుస్తూ.. ఉర్రూతలూగించిన ప్రజా గాయకుడు, యుద్దనౌన గద్దర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు
తెలంగాణలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రజాగాయకుడు, యుద్దనౌక గద్దర్ గుండెపోటుతో హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రెండు రోజుల క్రితం ఆయన గుండెపోటుకు గురయ్యారు. వెంటనే ఆయనను హైదరాబాద్ అపోలో స్పెక్ట్రా ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. గత పదిరోజుల నుంచి ఆయన ఛాతినొప్పితో ఇబ్బంది పడుతున్నారు.. ఈ క్రమంలోనే ఆయనకు గుండెపోటు వచ్చినట్లు సమాచారం. కాగా, మల్టిపుల్ ఆర్గాన్స్ పూర్తిగా దెబ్బతినడంతో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గతంలో ఆయనపై కాల్పులు జరిగిన విషయం తెలిసిందే.. దాదాపు చావు అంచు వరకు వెళ్లివచ్చారు గద్దర్. ఆయన శరీరంలో ఇప్పటికీ ఒక బుల్లెట్ అలాగే ఉండిపోయిందని అంటారు. ఆయనపై కాల్పులు జరిగిన రోజు ఏం జరిగింది? అన్న విషయం గురించి తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..
మెదక్ జిల్లా లోని తూప్రాన్ గ్రామంలో లచ్చమ్మ, శేషయ్యలకు 1949లో జన్మించిన గద్దర్ అసలు పేరు గుమ్మడి విఠల్ రావు. అందరికీ ఆయన ప్రజా గాయకుడు, యుద్దనౌక గద్దర్గా సుపరిచితం. తన పాటలను ఆయుధంగా మార్చి పాలకులపై ఎక్కుపెట్టిన ప్రజా బాణం గద్దర్. తెలంగాణ ఉద్యమ సమయంలో పల్లెలు, పట్నాలు అనే తేడా లేకుండా ఎన్నో వేదికలపై తన గొంతుకతో లక్షల మందిని తెలంగాణ రాష్ట్ర ఉద్యమం వైపు మళ్లించిన ఘనత ఆయనది. గతంలో ఆయన మావోయిస్టు నేతగొ కొనసాగారు. తర్వాత మావోయిస్టు పార్టీకి దూరం తన ఆట పాటలతో పాలక ప్రభుత్వాలను నిలదీస్తున్నారు. రాజకీయంగా ఎన్నో అవకాశాలు వచ్చినప్పటికీ ఎన్నికలకు, పార్టీలకు దూరంగా ఉంటూ ప్రజా ఉద్యమంతో ముందుకు సాగారు.
ప్రజా సమస్యలపై గళమెత్తిన గద్దర్ పై కొంతమంది కక్ష్యకట్టారు. తాము చేస్తున్న అన్యాయాలు, అక్రమాలకు పదే పదే అడ్డు వస్తున్నారని ఆయనపై కుట్ర చేశారు. 1997 ఏప్రీల్, 6న హైదరాబాద్ లోని ఆయన నివాసంలో గుర్తు తెలియని దుండగులు అందరూ చూస్తుండగానే గద్దర్ పై విచక్షణారహితంగా కాల్పులు జరిపి పారిపోయారు. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. రెండు బుల్లెట్లు ఆయన ఛాతిలోకి దూసుకువెళ్లాయి.. అందులో ఒక బుల్లెట్ ఇప్పటికీ ఆయన శరీరంలోనే ఉన్నదని అంటుంటారు. గుండెకు అతి సమీపంలో ఆ బుల్లెట్ ఉండటంతో తీస్తే ప్రాణాలకు ప్రమాదమని వైద్యులు సలహా ఇవ్వడంతో ఆ బుల్లెట్ శరీంలోనే విడిచిపెట్టారు. చికిత్స అనంతరం ఆయన బయటకు వచ్చి మల్లీ ప్రజా ఉద్యమం కొనసాగించారు. భూస్వాములు, బడా పారిశ్రామిక వేత్తలు పేద ప్రజల శ్రమను దోచుకు తింటున్నారని ఆయన పాటలతో ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చారు.