మనిషి తయారు చేసిన డబ్బు ఇప్పుడు ఆ మనిషినే నడిపిస్తుంది. సొసైటీలో డబ్బు ఉంటే మంచి హోదా, గౌరవం ఉంటుంది. ఆ డబ్బు కోసం కొంత మంది ఎన్ని కష్టాలైనా పడుతుంటారు. కొంత మంది ఈజీ మనీకోసం అడ్డదారులు తొక్కుతుంటారు. మనం రోజూ కష్టం చేసిన డబ్బు కళ్లముందే మాయమైతే ఎంత నరకంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. కూలీ చేసుకుంటూ ఒక్కో పైసా పోగు చేసి దాచుకుంటే.. ఆ డబ్బు కాస్త చెదలు తినేస్తే ఆ మనిషి ఎంత నరకం అనుభవిస్తాడో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. సుతారి మేస్త్రీగా ఉన్న ఓ వ్యక్తి కొంత కాలంగా రూ.1.5 లక్షలు దాచుకున్నాడు.. అవి కాస్త చెదలు తినడంతో బోరున విలపిస్తున్నాడు. వివరాల్లోకి వెళితే..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన గడ్డం లక్ష్మయ్య గత కొంత కాలంగా మేస్త్రీగా జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. మొదట కూలీగా ఉన్నప్పటికీ ప్రస్తుతం కొంత మంది కూలీలను వెంటతీసుకొని ఇళ్ల నిర్మాణం చేపడుతూ డబ్బు సంపాదిస్తున్నాడు. గత కొంత కాలంగా ఆయన సంపాదిస్తున్నదానిలో కొంత డబ్బును తీసుకొని ఒక సూట్ కేసులో దాస్తూ వచ్చాడు. ఏదైనా ముఖ్యమైన అవసరాలకు ఆ డబ్బు వినియోగించుకోవొచ్చు అన్న ఆలోచనలో లక్ష్మయ్య ఉన్నాడు. అలా ఆయన లక్షన్నర వరకు దాచుకోవడం జరిగింది.
ఈ మద్య భారీగా వర్షాలు పడటంతో ఆయన నివసిస్తున్న ఇంట్లో సజ్జెలకు చెమ్మ వచ్చింది. దీంతో సజ్జెలు కూలిపోయే ప్రమాదం ఉందని గ్రహించిన లక్ష్మయ్య సూట్ కేస్ ని వేరే చోటికి మార్చాలని అనుకున్నాడు. అందులో డబ్బు మరోసారి లెక్కపెట్టుకుందాం అని తెరిచి చూస్తే.. మైండ్ బ్లాక్ అయ్యింది. తాను దాచుకున్న రూ.2 వేలు, రూ.500 నోట్లు మొత్తం చెదలు తినేశాయి.
ఏం చేయాలో తోచని లక్ష్మయ్య లబోదిబో అంటు ఇల్లందులోని పలు బ్యాంకులకు వెళ్లాడు. అక్కడ వారంతా ఆ నోట్లను తీసుకొని హైదరాబాద్ వెళ్లాలని సూచించారు. ఈ కష్టం నుంచి తనని ఎవరైనా ఆదుకోవాలని వేడుకుంటున్నాడు లక్ష్మయ్య. డబ్బులు ఎప్పుడైనా బ్యాంకు లో దాచుకోవాలని.. ఇలాంటి సూట్ కేసులు, బట్టలో మూట కట్టడం, భూమిలో పాతి పెట్టడం లాంటి అనాలోచిత చర్యల వల్ల చేతులారా కష్టాలు తెచ్చుకోవడం జరుగుతుందని అంటున్నారు బ్యాంక్ అధికారులు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.