తెలంగాణలో గత కొంత కాలంగా పోలీస్ వ్యవస్థలో ఎన్నో మార్పులు చేర్పులు వచ్చాయి. ఒకప్పుడు పోలీస్ స్టేషన్ కి ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్లాలంటే కొంత మంది భయపడేవారు.. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసులు, సాధారణ ప్రజలకు మధ్య సన్నిహిత సంబంధాలు ఏర్పడేందుకు కృషి చేశారు. ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థను తీసుకు వస్తున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఇట్టే వాలిపోతున్నారు పోలీసులు. గత రెండేళ్లుగా కరోనా ఇబ్బందులు ఎన్ని వచ్చినా.. విధి నిర్వహణలో అనేక మంది పోలీసులు కరోనా బారిన పడ్డా ఏమాత్రం లెక్క చేయకుండా ప్రజల రక్షణ కోసం ముందుకు సాగుతున్నారు.
24 గంటలు విధులు నిర్వహిస్తూ.. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తున్నారు పోలీసులు. ఇక కష్టాల్లో ఉన్న ప్రజలకు మేమున్నామంటూ భరోసా కల్పిస్తూ వారికి సేవలు చేస్తున్నారు పోలీసులు. తాజాగా పెట్రోలింగ్ డ్యూటీ చేస్తున్నప్పుడు పిఎస్ చిల్కల్గూడకు చెందిన పిసి 9918 కిరణ్, హెచ్జి ఇమ్రాన్ ఓ గర్భిణి కష్టాలు పడటం చూశారు. ప్రస్తుతం భారీ వర్షాలతో ఆమెకు ఎలాంటి వాహన సదుపాయం లేకపోవడంతో ఇబ్బందులు పడుతుంది.
అదే సమయానికి పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పిసి 9918 కిరణ్, హెచ్జి ఇమ్రాన్ ఆమెను పెట్రోలింగ్ వాహనంలో గాంధీ ఆసుపత్రికి తరలించారు, ఇప్పుడు ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. పోలీసులు చేసిన మంచి పనికి నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు.