గత కొంత కాలంగా తెలంగాణలో డ్రగ్స్ కేసు కలకలం సృష్టిస్తుంది. టాలీవుడ్ డ్రగ్స్ కేసుపై ఇవాళ హైకోర్టు విచారణ చేసింది. డ్రగ్స్ కేసుపై 2017లో రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిల్ పై ఈ విచారణ జరిగింది. ప్రభుత్వం ఈడీకి సహకరించట్లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ కేసులో కీలక వ్యక్తుల ప్రమేయం ఉందని లాయర్ రచనారెడ్డి వాదించారు. కేసు విషయంలో ప్రభుత్వ దర్యాప్తు సరిగా లేదని ఆరోపించారు. దీంతో కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయని అన్నారు. ఈ విషయం ఆన్ లైన్ విచారణలో నేరుగా కోర్టుకు ఈడీ జేడీ అభిషేక్ గోయెల్ వివరించారు. డ్రగ్స్ కేసులో డాక్యుమెంట్లు, వివరాలను ప్రభుత్వం ఇవ్వడం లేదన్నారు.
ఇది చదవండి: ఉద్యోగ సంఘాలపై సజ్జల ఆగ్రహం.. బలప్రదర్శన సరికాదు
ఈడీ అడుగుతున్న డాక్యుమెంట్లు ఎక్సైజ్ శాఖ తమకు ఇవ్వడం లేదని కోర్టు చెబుతోందని జేడీ పేర్కొన్నారు. ఈ క్రమంలో ఎఫ్ఐఆర్ లు, ఇతర పూర్తి వివరాలు ఈడీకి అప్పగించాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈడీ దరఖాస్తు చేస్తే 15 రోజుల్లో వివరాలు ఇవ్వాలని విచారణ కోర్టులకు ఆదేశించిన హైకోర్టు.. డ్రగ్స్ కేసులో కాల్ డేటా రికార్డులను నెల రోజుల్లో ఇవ్వాలని తెలిపింది. వివరాలు ఇవ్వకపోతే సంప్రదించవచ్చని ఈడీకి హైకోర్టు సూచించింది.
ఇది చదవండి: అద్భుతం! సముద్రం నుండి ఒడ్డుకి కొట్టుకొచ్చిన శివలింగం!
సీబీఐ, ఇతర దర్యాప్తు సంస్థలకు కేసు ఇవ్వాల్సిన అవసరం లేదన్న హైకోర్టు.. తమ ఆదేశాలను అమలు చేయకపోతే తీవ్రంగా పరిగణిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించింది. మాదకద్రవ్యాలు యువతపై తీవ్రం ప్రభావం చూపుతున్నాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. అంతేకాదు దేశ ప్రయోజనాల కోసం ఈడీ దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని హైకోర్టు సూచించింది.