తెలంగాణకు కేంద్ర సర్కారు మరో గుడ్న్యూస్ చెప్పింది. ఒక భారీ ప్రాజెక్టును రాష్ట్రానికి కేటాయింది. దీని ద్వారా లక్షలాది మందికి ఉద్యోగాలు లభించే అవకాశాలు ఉన్నాయి. మిగిలిన వివరాలు మీ కోసం...
తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం మరో మెగా ప్రాజెక్టును ప్రకటించింది. పీఎం మిత్ర స్కీమ్లో భాగంగా రాష్ట్రంలో మెగా టెక్స్టైల్ పార్కును ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. తెలంగాణతో పాటు ఏడు రాష్ట్రాలకు మెగా టెక్స్టైల్ పార్కులను కేటాయిస్తున్నట్లు ఆయన తెలిపారు. టెక్స్టైల్ పార్కుల ఏర్పాటుతో రూ. వేల కోట్ల పెట్టుబడులు, లక్షలాది ఉద్యోగాలు వస్తాయని మోడీ చెప్పారు. మేకిన్ ఇండియా, మేక్ ఫర్ వరల్డ్కు ఇదో గొప్ప ఉదాహరణగా నిలుస్తుందని మోడీ చెప్పుకొచ్చారు. 13 రాష్ట్రాల నుంచి ప్రతిపాదనలు అందగా.. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాలను సెలెక్ట్ చేశామని కేంద్ర జౌళి శాఖ తెలిపింది.
దేశంలోని టెక్స్టైల్ రంగానికి మరింత ఊతం ఇచ్చేందుకు టెక్స్టైల్ విధానం, ఎకోసిస్టమ్, కనెక్టివిటీ, మౌలిక సదుపాయాలను పరిగణనలోకి తీసుకుని పార్కులను ఏర్పాటు చేసే ప్రాంతాలను ఎంపిక చేశామని జౌళి శాఖ పేర్కొంది. ఒక్కో పార్కు ఏర్పాటుకు కనీసం 1,000 ఎకరాల భూమిని కేటాయించటంతో పాటు సింగిల్ విండో పర్మిషన్స్, విద్యుత్తు, నీటి వసతి, వ్యర్థ జలాల నిర్వహణ వ్యవస్థ లాంటివి రాష్ట్ర ప్రభుత్వాలే చూసుకోవాల్సి ఉంటుందని జౌళి శాఖ వివరించింది. దీనిపై కేంద్ర జౌళి శాఖ మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడారు. పీఎం మిత్రా మెగా టెక్స్టైల్ ఏర్పాటు ద్వారా 20 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందని ఆయన అన్నారు.
ఏడు రాష్ట్రాలకు ఇది ఆనందకరమైన రోజు అని చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద టెక్స్టైల్స్ ఎగుమతిదారుల్లో భారత్ ఒకటి అని పీయూష్ చెప్పుకొచ్చారు. టెక్స్టైల్ రంగంలో ఇంటర్నేషనల్ లెవల్లో పోటీపడే సామర్థ్యం ఇండియాకు ఉందన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో పోటీ పడడానికి భారీ టెక్స్టైల్ పార్కులు ఏర్పాటు చేయాలని తాము నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ప్రతి పీఎం మిత్ర పార్కుకు ప్రోత్సాహక మద్దతుగా రూ. 300 కోట్లు అందిస్తామని ఆయన వివరించారు. ఈ స్కీమ్ అమలుకు కేంద్ర బడ్జెట్లో రూ. 4,455 కోట్లు కేటాయించామన్నారు.
ఇక, వరంగల్లో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. గీసుకొండ మండలాల పరిధిలోని సుమారుగా 3 వేల ఎకరాల్లో టెక్స్టైల్ పార్కును ఏర్పాటు చేశారు. దీంతో పాటు సిరిసిల్ల మెగా టెక్స్టైల్ పార్కునూ ఏర్పాటు చేయాలని కేసీఆర్ సర్కారు కేంద్రాన్ని పలుమార్లు కోరింది. పీఎం మిత్ర పథకంలో చేర్చాలంటూ విజ్ఞప్తి చేసింది. ఎట్టకేలకు ఈ విషయంపై కేంద్ర సర్కారు శుభవార్త చెప్పింది. ప్రధాని ప్రకటనతో వరంగల్ లేదా సిరిసిల్లలో ఏదో ఒకచోట మెగా టెక్స్టైల్ పార్కు ఏర్పాటయ్యే ఛాన్సులు కనిపిస్తున్నాయి. వీటి ఏర్పాటు వల్ల లక్షలాది మందికి ఉపాధి లభించే అవకాశాలు ఉన్నాయి.
PM MITRA mega textile parks will boost the textiles sector in line with 5F (Farm to Fibre to Factory to Fashion to Foreign) vision. Glad to share that PM MITRA mega textile parks would be set up in Tamil Nadu, Telangana, Karnataka, Maharashtra, Gujarat, MP and UP.
— Narendra Modi (@narendramodi) March 17, 2023