రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పోడు భూముల గురించి. వాటికోసం అధికారులు, ప్రజల మధ్య జరిగే గొడవల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే ఘటన అటు అటవీశాఖ అధికారులనే కాదు.. ఇటు ప్రజలను కూడా ఆందోళనకు గురిచేస్తోంది. ఎందుకంటే పోడు భూముల వివాదంలో ఓ అటవీశాఖ అధికారి ప్రాణాలు కోల్పోయారు. అటవీశాఖ భూములను కాపాడేందుకు పూనుకున్న ఫారెస్ట్ రేంజ్ అధికారిపై విచక్షణారహితంగా దాడి చేశారు. కత్తులు, గొడ్డళ్లు తీసుకుని పోడుభూముల సాగుదారులు దాడికి దిగారు. తీవ్రంగా గాయపడిని ఆయనని ఆస్పత్రికి తరలిస్తుండగానే మార్గం మధ్యలోనే ప్రాణాలు కోల్పోయాలు.
వివరాల్లోకి వెళ్తే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం బెండాలపాడు అటవీప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఎర్రబోడు సమీపంలో అటవీశాఖ అధికారులు మొక్కలు నాటారు. మంగళవారం ఉదయం వాటిని తొలగించేందుకు పోడుభూముల సాగుదారులు ప్రయత్నించారు. వారిని అడ్డుకునేందుకు ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీనివాసరావు, రామారావు వెళ్లారు. అక్కడికి వచ్చిన పోడుభూముల సాగుదారులు మూక్కుమ్మడిగా దాడికి దిగారు. వేటకొడవళ్లు, కత్తులు, గొడ్డళ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఆ దాడి నుంచి రామారావు తప్పించుకున్నారు. అయితే శ్రీనివాసరావు మాత్రం వారి దాడిలో తీవ్రంగా గాయపడ్డారు. ముఖ్యంగా మెడ భాగంలో బలమైన గాయాలు కావడం వల్ల.. తీవ్ర రక్తస్రాయం జరిగింది.
దాడిలో గాయపడిన శ్రీనివాసరావుని.. చంద్రుగొండు పీహెచ్ సీకి తరలించి చికిత్స అందించారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో.. అక్కడి నుంచి అంబులెన్సులో ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగానే.. మార్గం మధ్యలోనే ఆయన తుదిశ్వాస విడిచారు. విధినిర్వహణలోనే అటవీశాఖ అధికారి శ్రీనివాసరావు ప్రాణాలు కోల్పోయారు. అధికారి మృతిపై అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శ్రీనివాసరావు కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పోడు భూముల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తుంటే.. ఇలా దాడులు చేయడం సరైంది కాదని వారించారు.
అలాగే.. అటవీభూముల ఆక్రమణలను సహించేది లేదని ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు. ఎవరైనా అటవీ భూములను ఆక్రమించేందుకు ప్రయత్నిస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని అధికారులకు హామీ ఇచ్చారు. అటవీశాఖ అధికారులు మనోస్థైర్యం కోల్పోకుండా ఉండాలంటూ సూచించారు. ఈ ఘటనపై సీఎం కేసీఆర్ కూడా స్పందించారు. శ్రీనివాసరావు కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం ప్రకటించారు. ఆయన పూర్తి జీతభత్యాలను చెల్లిస్తామని చెప్పారు. రైటైర్మెంట్ వయసు వరకు పూర్తి జీతభత్యాలను కుటుంబానికి అందజేస్తామన్నారు. అధికారిక లాంఛనాలతో అధికారి అంత్యక్రియలు నిర్వహిస్తామన్నారు. ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామన్నారు. ఈ దాడి చేసిన వారిని గుర్తించి కఠినశిక్ష పడేలా చూస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు.