కొన్నేళ్లుగా ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ నగరవాసుల జీవన శైలిలో భాగమైంది. డెలివరీ బాయ్స్ వినియోగదారుల నుంచి ఆర్డర్లు అందుకున్న డెలివరీ పసందైన రుచులతో క్షణాల్లో వాలిపోతున్నారు. చిన్న చిన్న హోటళ్లు మొదలుకొని అతి పెద్ద రెస్టారెంట్ల వరకు ఇప్పుడు ఆన్లైన్పైన ఆధారపడి ఉన్నాయి. నగరంలో ఆన్లైన్ ఫుడ్ డెలవరీ యాప్లలో జొమాటో, స్విగ్గీ అగ్రస్థానంలో ఉన్నాయి. 25 వేల మందికి పైగా ఈ రంగంలో పనిచేస్తున్నారు. ఇంకా వేలమంది నిరుద్యోగ యువకులు పార్ట్టైమ్ జాబ్గా దీనిని ఎంపిక చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు లాక్ డౌన్ నిబంధనలుకఠినతరం చేయడంవల్ల వారి పరిస్థితి ఇబ్బందులకు గురవుతున్నారు. నగర వ్యాప్తంగా స్విగ్గీ, జొమాటో బాయ్స్ వాహనాలను పోలీసులు సీజ్ చేస్తున్నారు. ఎల్బీ నగర్, ఖైరతాబాద్, ప్యాట్నీ చౌరాస్తా పలు ప్రాంతాల్లో వాహనాలను పోలీసులు అడ్డుకోవడంతో డెలివరీ బాయ్స్ ఆందోళనకు దిగారు.
ఫుడ్ డెలివరీ కోసం వస్తే వాహనాలు సీజ్ చేస్తున్నారని వాపోయారు. డెలివరీ ఆపేయాలని తమ సంస్థల నుంచి సమాచారం లేదని పోలీసులకు చెప్పినా వినడం లేదని అంటున్నారు. ముందుగా సమాచారం ఇస్తే తాము రోడ్ల మీదకు వచ్చే వాళ్ళమే కాదని అనవసరంగా తమను ఇబ్బందుల పాల్జేస్తున్నారని చెబుతున్నారు. కనీసం నీళ్లు కూడా లేవని రెండు మూడు గంటల నుంచి రోడ్లపైనే ఉన్నామని డెలివరీ బాయ్స్ అంటున్నారు. మరోవైపు పోలీసులు మాట్లాడుతూ కేవలం అనుమతులు ఉన్నవారు మాత్రమే సంబంధిత ఐడి కార్డు గానీ, లెటర్స్ గానీ తీసుకొని రావాలని వాటిని చూపిస్తేనే అనుమతి ఇస్తామంటున్నారు.