తెలంగాణలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వానలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో వరద ప్రాంతాలను సందర్శిస్తున్న సమయంలో మంత్రి కేటీఆర్ కు వింత అనుభవం ఎదురైంది. సిరిసిల్ల పట్టణంలోని వరద ప్రాంతాల్లో బుధవారం మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. ఇదే సమయంలో తమ ఇంటి ముందు ఉన్న ట్రాన్స్ ఫార్మర్ సమస్య చెప్పేందుకు బీటెక్ చేస్తున్న స్నేహ అనే అమ్మాయి మంత్రి కేటీఆర్ ని కలుసుకునే ప్రయత్నం చేసింది.
కానీ ఆ యువతి బాధను ఎవరూ పట్టించుకోలేదు సరికదా.. పక్కకు నెట్టారు. దాంతో ఆవేశంతో ఊగిపోయి “మీరు ఆగుతారా లేదా..?” అంటూ గద్దించి మరీ మంత్రి కేటీఆర్ ఆగిపోయేలా చేసింది బిటెక్ స్టూడెంట్ స్నేహ. ఆమె పిలుపుతో ఆగిపోయిన కేటీఆర్ సమస్యను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల వచ్చిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతమైన శాంతినగర్ ఏరియాలో మంత్రి కేటీఆర్ సందర్శించి వరద బాధితులను పరామర్శిస్తున్న సమయంలో బీటెక్ స్టూడెంట్ స్నేహ కలిసింది. గత కొన్ని సంవత్సరాలుగా తమ ఇంటి ముందు ట్రాన్స్ ఫార్మర్ ఉందని.. దాని వల్ల వర్షాలు వచ్చినపుడు ప్రమాదం జరుగుతుందేమో అని భయంతో ఛస్తున్నామని.. తమ గోడు ఎంతమంది ఆఫీసర్లకు చెప్పినా పట్టించుకోవడం లేదని.. ఒక్కసారి రండి.. మా ఇంటికి రండి సార్ అంటూ ప్రాధేయపడింది.
“కరెంటు సమస్యలు తర్వాత అమ్మా.. ముందు వరద సమస్యలు తెలుసుకుంటా” అంటూ.. మంత్రి కేటీఆర్ సర్దిచెప్పి వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. సర్ మావి ప్రాణాలు కావా..? ఎందుకు రారు..? ఒక్కటే ఒక్కసారి రండి.. ప్లీజ్ సర్.. ఫస్ట్ మీరు ఆగండి సర్..వెళ్లకండి.. ఆగి సమాధానం చెప్పండి.” అంటూ కాస్త గద్దించినట్టే అడిగింది. అంతే కాదు “మమ్మి లెటర్ ఇయ్యి, లెటర్ ఇవ్వవే” అంటూ మంత్రి కేటీఆర్ ను ఆపేసింది స్నేహ. అక్కడ అధికారులు, పోలీసులు ఎంత కట్టడి చేస్తున్నా ఆ అమ్మాయి చొరవ చూసి మంత్రి కేటీఆర్ ఈ సమస్య పూర్తి చేయండి అని కలెక్టర్ అనురాగ్ జయంతిని ఆదేశించారు. అంతే కాదు ఆ అమ్మాయిని ఏం చదువుతున్నావని.. అడిగారు.. దానికి “స్నేహ.. బీటెక్ ” అని చెప్పింది. “గింత సిన్నగున్నవ్.. బిటెక్ సదువుతున్నవా.. గందుకే గింత గట్టిగా మాట్లాడుతున్నవ్” అంటూ నవ్వుతూ ఆమెను దగ్గరకు తీసుకున్నారు మంత్రి కేటీఆర్. అల్ ది బెస్ట్ అమ్మా అంటూ అక్కడ నుంచి వెళ్లిపోయారు.