కాలం మారుతోంది. మనిషిలోని మంచితనం, మానవత్వం మెల్లిమెల్లిగా గోడకు కొట్టిన సున్నంలా రాలిపోతున్నాయి. కొందరు వ్యక్తులు ప్రాణాపాయంలో ఉన్న సొంత వారినే కాపాడుకోవటం కూడా గగనం అయిపోయింది. ఎంతలా అంటే.. ఓ తండ్రి నీటిలో మునిగి చనిపోతుంటే.. అతడి ఇద్దరు కుమారులు ఒడ్డున నిలబడి వీడియో తీసేంతలా.. కన్నతండ్రి చనిపోతున్నాడని తెలిసినా వాళ్లు పట్టించుకోలేదు. తండ్రి ప్రాణాల కంటే.. ఆయనతో కాసిన పందేనికే ఆ ఇద్దరు కుమారులు విలువ ఇచ్చారు. చివరకు తండ్రిని కోల్పోయారు. ఈ సంఘటన తెలంగాణలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..
నాగర్ కర్నూల్ జిల్లా పెంటవెల్లికి చెందిన 45 ఏళ్ల కృష్ణయ్యకు ఇద్దరు కుమారులు ఉన్నారు. కృష్ణయ్య తన ఇద్దరు కుమారులతో ఎంతో ఫ్రెండ్లీగా ఉండేవాడు. వారితో కలిసి మందు కూడా కొట్టేవాడు. ఈ నేపథ్యంలోనే బుధవారం ముగ్గురు పూటుగా మందు తాగారు. తర్వాత మద్యం మత్తులో వీరి మధ్య చిన్న గొడవ జరిగింది. ఈ సందర్భంగా తండ్రీ, కుమారులు ఓ పందెం పెట్టుకున్నారు. గ్రామంలోని చెరువును ఇవతలి ఒడ్డునుంచి అవతలి ఒడ్డుకు ఈదుకుంటూ వెళ్లాలని తండ్రితో పందెం కాశారు. ఇందుకు కృష్ణయ్య సరేనన్నాడు. తాగి ఉంటే నీటిలో ప్రమాదం అని గ్రహించకుండా పందేనికి సిద్ధమయ్యాడు.
ముగ్గురు చెరువు దగ్గరికి వెళ్లారు. కృష్ణయ్య తాను గెలుస్తానన్న ధీమాతో చెరువులోకి దిగాడు. ఈదు కుంటూ వెళుతున్నాడు. చెరువు మద్యలోకి రాగానే అతడికి ఊపిరి ఆడలేదు. దానికి తోడు మద్యం మత్తులో ఉండటంతో శరీరం అతడికి సహకరించలేదు. ఈదటం అతడి వల్లకాలేదు. నీటిలో మునిగి చనిపోయాడు. ఒడ్డున ఉన్న ఇద్దరు కుమారులు తండ్రి చెరువు ఈదుతున్న దృశ్యాలను వీడియో తీస్తూ ఉన్నారు. తండ్రి నీటిలో మునగటం చూస్తూనే ఉన్నారు. అయినా వాళ్లు పట్టించుకోలేదు. తండ్రి నీటిలో మునిగి చనిపోతుంటే వీడియో తీశారు తప్పితే.. ఆయన్ని రక్షించడానికి కొంత కూడా ప్రయత్నం చేయలేదు.