దేవుడి పట్ల భక్తి మనుషులకే కాదు, మాకు కూడా ఉంటుందని కొన్ని జంతువులు నిరూపిస్తున్నాయి. ఏనుగులు, కోతులు, తాబేలు వంటి జీవరాశులు దేవుడి పట్ల తమ భక్తిని చాటుకున్న సందర్భాలను చూశాం. పురాణాల్లో కూడా జంతువుల దైవభక్తికి సంబంధించి పలు సందర్భాల్లో కూడా చెప్పబడింది. పాములు కూడా దైవం పట్ల భక్తిని చాటుకుంటాయని కొన్ని సందర్భాల్లో మనం చూసాం. రీసెంట్ గా ఒక పాము గ్రహణ సమయంలో కదలకుండా రోడ్డు పైనే నిలిచిపోయింది. దీంతో ఆ పాము గ్రహణాన్ని పాటించిందని ప్రచారం చేశారు. తాజాగా మరో పాము కూడా దైవభక్తిని చాటుకుందని ప్రచారం చేస్తున్నారు. శివలింగం మీదకు ఎక్కి.. గంట సేపు ప్రదక్షిణలు చేసింది.
తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో.. దోమకొండ శివారులో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఉన్న శివాలయంలో చోటు చేసుకుంది ఈ ఘటన. సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఇతర ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. వాటిలో శివాలయం ఒకటి. ఈ శివాలయంలోకే ఆ పాము వెళ్ళింది. ఆదివారం ఉదయం గర్భాలయంలోకి వెళ్లి.. సుమారు గంట సేపు శివలింగం చుట్టూ ప్రదక్షిణలు చేసింది. ఆ తర్వాత శివలింగాన్ని చుట్టుకుని చాలా సేపు అలానే ఉండిపోయింది. ఈ విషయం భక్తులకు తెలియడంతో ఈ వింతను చూసేందుకు భారీగా ఆలయం వద్దకు చేరుకున్నారు. పాము దర్శనమివ్వడంతో ఆలయం ముందు ప్రత్యేక పూజలు నిర్వహించి.. శివనామ స్మరణ చేశారు. కాసేపటికి పాము ఆలయంలోని ఓ మూలకు వెళ్లిపోగా.. పాములు పట్టుకునేవాళ్ళు వచ్చి పాముని తీసుకెళ్లి.. అటవీ ప్రాంతంలో సురక్షితంగా విడిచిపెట్టారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.