ఈ మద్య పలువురు రాజకీయ నేతలు తమ మంచితనం, మానవత్వం చాటుకుంటూ ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటున్నారు. ఎంత ఎమర్జెన్సీ పనిపై వెళ్తున్నప్పటికీ రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులను వెంటనే తమ కాన్వాయ్ లో హాస్పిటల్ కి పంపి వైద్యులకు మెరుగైన చికిత్స అందించాల్సిందిగా కోరుతున్నారు. ఇటీవల ఇలాంటి ఘటనుల ఎన్నో వెలుగు చూశాయి. తెలంగాణ మంత్రి కేటీఆర్ ఎవరైనా ఆపదలో ఉంటే వెంటనే స్పందించి వారిని ఆదుకుంటారు. మంత్రి కేటీఆర్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే..
నాగర్ కర్నూల్ కి చెందిన నర్మద, రమేశ్ దంపతులు ద్విచక్ర వాహనంపై తమ కొడుకును రంగారెడ్డి లో ఉన్న ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లో దింపి తిరిగి వారి ఊరికి ప్రయానమయ్యారు. ఈ క్రమంలోనే పెద్ద అంబర్ పేట్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ఒక కారు ఆపి ఉంది. కారులో ఉన్నవాళ్లు ఒక్కసారిగా డోర్ తీయడంతో బైక్ పై వెళ్తున్న దంపతులు ఢీ కొన్నారు.. దాంతో ఒక్కసారే ఎగిరి కిందపడటంతో తీవ్రంగా గాయాలపాలయ్యారు. అదే సమయంలో మునుగోడు ఎన్నికల ప్రచారం ముగించుకొని హైదరాబాద్ వస్తున్న మంత్రి కేటీఆర్ గమనించి వెంటనే కారు ఆపి బాధితుల వద్దకు వచ్చి పరామర్శించారు.
ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన దంపతులను వెంటనే తన కాన్వాయ్ లో హైదరాబాద్ హయత్ నగర్ లో ఓ హాస్పిటల్ కి పంపించారు. అక్కడ డాక్టర్లతో మాట్లాడి మెరుగైన చికిత్స అందించాలని కోరారు. ఎంత బిజీ షెడ్యూల్ లో ఉన్నప్పటికీ.. మంత్రి కేటీఆర్ చూపించిన ఔదార్యంపై స్థానికులు, నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా మంత్రి కేటీఆర్ ఆపదలో ఉన్న ఎంతోమందిని ఆదుకున్న విషయం తెలిసిందే.