దక్షిణ మధ్య రైల్వే స్టేషన్లలో ఒకటైన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రూపు రేఖలు పూర్తిగా మారిపోనున్నాయి. ఈ స్టేషన్ నవీకరణం చెందబోతోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని బిజెపి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ట్విట్లర్ లో తెలియజేశారు. వాటితో పాటు పునరాభివృద్ధికి సంబంధించిన డిజైన్లు షేర్ చేశారు.
భారత్లోని దక్షిణ మధ్య రైల్వే స్టేషన్లలో ఒకటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. తెలంగాణలో అతిపెద్ద రైల్వేస్టేషన్ కూడా ఇదే. 1874 సం.లో నిజాం పాలనలో హైదరాబాదు రాష్ట్రంగా ఉన్న సమయంలో దీన్ని నిర్మించారు. నిజాం పాలన తర్వాత అదీ ప్రభుత్వ పరమైంది. అప్పటి నుండి ఇప్పటి వరకు దీని సేవలు కొనసాగుతూనే ఉన్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి నిత్యం 200 రైళ్లు వేర్వేరు ప్రాంతాలకు వెళ్తుంటాయి. రోజూ 1.8 లక్షల మంది ప్రయాణీకులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. ఈ స్టేషన్ నుండి జంట నగరాలకు రోడ్డు మార్గం కూడా ఉంది. అయితే ఇప్పుడు ఈ స్టేషన్ రూపురేఖలు మారిపోతున్నాయి. ఈ స్టేషన్ పునరాభివృద్ధి చేపట్టాలని కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ నెల 8న తెలంగాణలో పర్యటించనున్న ప్రధాని నరేంద్ర మోదీ.. ఈ పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. రూ. 719 కోట్ల రూపాయలతో.. కేంద్రం ప్రభుత్వం పునర్నిర్మాణ పనులు చేపట్టబోతోంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధికి సంబంధించిన డిజైన్ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు. ఈ డిజైన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎయిర్ పోర్టును తలపించేలా .. వరల్డ్ క్లాస్ స్టేషన్గా మారిపోనుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు మూడేళ్లలో పూర్తి చేయాలని భారతీయ రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది.
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నాన్ సబ్ అర్బన్ గ్రేడ్ 1 (NSG1) స్టేషన్గా గుర్తించిన ఏకైక రైల్వే స్టేషన్ ఇదే కావడం విశేషం. ఏటా 2 కోట్లకు పైగా ప్రయాణికులకు సేవలు అందిస్తూ, రూ.500 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తున్న రైల్వే స్టేషన్లు NSG1 పరిధిలోకి వస్తాయి. రాబోయే రోజుల్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వచ్చే ప్రయాణికుల సంఖ్య భారీగా పెరగనుంది .సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పెరుగుతున్న రద్దీని దృష్టిలో పెట్టుకొని ఆధునిక సౌకర్యాలు, సదుపాయాలతో ఈ స్టేషన్ను అప్గ్రేడ్ చేయాలని భారతీయ రైల్వే నిర్ణయించింది. రైల్వే ప్రయాణికులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు అందించడానికి స్టేషన్ కాంప్లెక్స్ను ఇంటిగ్రేట్ చేస్తూ ఓ మాస్టర్ ప్లాన్ను ఇప్పటికే రూపొందించింది.
జీ ప్లస్ 3 (G + 3)అంతస్తులతో ఉత్తరం వైపు ఒక స్టేషన్ భవనం, దక్షిణం వైపు మరో భవనం నిర్మించనుంది. రైల్వే స్టేషన్కు ఉత్తరం వైపు మల్టీ-లెవల్ పార్కింగ్ ఏర్పాటు చేస్తుంది. దక్షిణం వైపు అండర్ గ్రౌండ్ పార్కింగ్ సదుపాయం ఉంటుంది. ఉత్తరం, దక్షిణం భవనాల దగ్గర ట్రావెలేటర్లతో పాటు 7.5 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేసేలా రెండు నడక మార్గాలను నిర్మించనుంది. ఇక ఈస్ట్, వెస్ట్ మెట్రో స్టేషన్లను స్కైవేతో అనుసంధానం చేస్తుంది. కొత్త రైల్వే స్టేషన్ వాతావరణానికి సరిపోయేలా ఇప్పటికే ఉన్న ప్లాట్ఫారమ్లను పునరుద్ధరించనుంది. ఇక ఎంట్రీ, ఎగ్జిట్ బ్లాక్స్ వేర్వేరుగా ఉండబోతున్నాయి. రైల్వే స్టేషన్ మొత్తానికి విద్యుత్ అందించేందుకు 5000 కిలో వాట్స్ సోలార్ పవర్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేయనుంది భారతీయ రైల్వే.
Hon’ble PM Shri @narendramodi will lay the foundation stone for the redevelopment of Secunderabad railway station on 8th April, 2023.
The Station is being revamped at a cost of Rs 719 crore and will provide world-class railway infrastructure and amenities. pic.twitter.com/btXyW76ejD
— G Kishan Reddy (@kishanreddybjp) April 4, 2023