సికింద్రాబాద్ నల్లగుట్టలోని డెక్కన్ మాల్లో గురువారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సంఘటనతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రమాదం భారీ స్థాయిలో ఉండటం.. మంటలు ఎగిసిపడటం, చుట్టుపక్కల ప్రాంతాలన్నీ దట్టమైన పొగ కమ్ముకోవడంతో స్థానిక ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. శుక్రవారం ఉదయం నాటికి కూడా డెక్కన్ మాల్లో మంటలు అదుపులోకి రాలేదని తెలుస్తోంది. శుక్రవారం ఉదయం నాటికి కూడా సెల్లార్లో ఇంకా స్వల్పంగా మంటలు కనిపిస్తూనే ఉన్నాయి. అంతేకాక ఏ క్షణన్నైనా బిల్డింగ్ కూల్చివేసే అవకాశముందని తెలుస్తోంది. మంటల ధాటికి పిల్లర్లు, స్లాబ్లోని ఐరన్ పూర్తిగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.
ఈ బిల్డింగ్ నిర్మాణంలో నిబంధనలు పాటించలేదని.. అందువల్లే.. దీన్ని కూల్చివేయాలని అధికారుల నుంచి ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. దీంతో శుక్రవారం లేదా శనివారం నాడు ఈ బిల్డింగ్ కూల్చివేసే అవకాశముందని తెలుస్తోంది. ఇక శుక్రవారం జేఎన్టీయూ నిపుణుల కమిటీ బిల్డింగ్ను పరిశీలించనుంది. ప్రమాదం నేపథ్యంలో భవనంలో చిక్కుకున్న ముగ్గురిని అధికారులు రక్షించగా.. మరో ముగ్గురి ఆచూకీ గల్లంతు అయింది. గల్లంతైన వారి కోసం అధికారులు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.
ఇక బిల్డింగ్ లోపల చిక్కుకున్న ఆ ముగ్గురు ఎక్కడున్నారో గుర్తించలేకపోతున్నామని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. బిల్డింగ్లో చెలరేగిన మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత గల్లంతైన ముగ్గురి ఆచూకీ కోసం గాలిస్తామని అధికారులు తెలిపారు. అగ్ని ప్రమాదం నేపథ్యంలో గురువారం మొత్తం 40 ఫైర్ ఇంజన్లతో పాటు అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. ఉదయం నుంచి రాత్రి వరకు కూడా సహాయక చర్యలు చేపట్టారు. ఇక మంటలు ఆపేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఇద్దరు ఫైర్ సిబ్బంది అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ఏడీఎఫ్ఓతో పాటు డ్రైవర్ అస్వస్థతకు గురవ్వగా.. వారిద్దరిని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక వీరిలో డ్రైవర్ నరసింహరావు పరిస్థితి విషమంగా ఉండగా.. వైద్యులు ఆయనకు వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు.
డెక్కన్ మాల్ని నిబంధనలకు విరుద్దంగా భవనం నిర్మించినట్లు అధికారులు చెబుతున్నారు. బిల్డింగ్ నిర్వాహకులు.. రెసిడెన్షియల్ భవనాన్ని కమర్షియల్ కాంప్లెక్స్గా మార్చినట్లు అధికారులు గుర్తించారు. ఇక షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. బిల్డింగ్ యజమాని G+4 అనుమతులు తీసుకుని.. మరో రెండు అంతస్తులను అదనంగా నిర్మించినట్లు అధికారులు గుర్తించారు. రెసిడెన్షియల్ బిల్డింగ్ను కమర్షియల్ బిల్డింగ్గా మార్చుకునేందుకు అధికారులు కూడా సహాకారం అందించినట్లు తెలుస్తోంది.
అంతేకాక ఓ ప్రముఖ నేత కుమారుడు బిల్డర్గా మారి.. అధికారులపై ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపణలు వినిపిస్తోన్నాయి. అధికారుల బృందం శుక్రవారం మాల్ను పరిశీలించి మరిన్ని వివరాలు సేకరించనుంది. ఇక డెక్కన్ మాల్ ప్రమాదంపై పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు. నిబంధనలు పాటించకుండా నిర్మాణం చేపట్టారని భవన యజమాని మహ్మద్, రహీంలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మరో ముగ్గురు మిస్సైనట్లు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.