ఎవరన్నా ఎండకు సేదతీరేందుకో, వానకు తల దాచుకునేందుకో చెట్టు కిందకు వెళ్తారు. కానీ, ఓ వృద్ధురాలు చెట్టునే ఇల్లుగా మార్చుకుంది. ఆ చెట్టుకిందే.. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 15 ఏళ్లుగా కాలం గడుపుతోంది. తనకంటూ ఎవరూ లేరు. అటుగా వెళ్లే వాళ్లు గుప్పెడు బియ్యం పెడితే వండుకుంటుంది. ఎవరో ఒక ధర్మాత్ముడు ఒక రూపాయి ఇస్తే దాచుకుంటుంది. కుటుంబంలో అందరూ కన్నుమూయగా తన వంతు ఎప్పుడొస్తుందా? అని ఆ అవ్వ ఎదురుచూస్తోంది. అటుగా వెళ్తూ సుమన్ టీవీ ఆమెను పలకరించగా.. తన కష్టాలు చెప్పుకుంటూ కుమిలిపోయింది.
ఆ అవ్వ మాటలు వింటే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు. దాదాపు 15 సంవత్సరాలుగా ఎండ, వాన, చలి ఇలా కాలం ఏదైనా ఆ చెట్టే ఆమెకు దిక్కు. కట్టుకున్న వాడు, కన్నపిల్లలు కాలం చేయగా.. నా అనే వాళ్లు లేక.. ఉన్న వాళ్లు పట్టించుకోక ఇలా అనాథగా కాలం వెల్లదీస్తోంది. మనసున్న వాళ్లు ఎవరో గుప్పెడు రేషన్ బియ్యం పెడితే వాటినే వండుకుని ఓ పుట తిని, మరో పూట తినకుండా జీవిస్తోంది. ప్రకాశం జిల్లా అద్దంకి మండలానికి చెందిన ఆ అవ్వను గద్వాల జిల్లాకు కోడలిగా పంపారు. ఆమె భర్త గొప్పగా వ్యాపారం చేసి బతికాడని స్థానికులు చెబుతున్నారు. కడుపున పుట్టిన వారిలో ఒకరు బావిలో పడి ప్రాణాలు కోల్పోగా.. మరొకరు క్యాన్సర్ తో కన్నుమూశారు. భర్త కూడా ప్రాణాలతో లేరు.
అదే ఊరిలో తమ బంధువులు ఉన్నా కూడా పట్టించుకోరు. పక్కన ఉండే వాళ్లు ఎవరన్నా ఆరోగ్యం బాగోకపోతే ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్తుంటారు. మంచి మనసుతో బాగోగులు చూస్తుంటారు. ఎవరన్నా వచ్చి వృద్ధాశ్రమానికి తీసుకెళ్తాం అని చెప్పినా కూడా అందుకు ఆమె నిరాకరించింది. ఆ చెట్టు కిందే తనకు జీవితం ప్రశాంతంగా ఉందని చెబుతోంది. సుమన్ టీవీ కూడా అమెను వృద్ధాశ్రమంలో చేర్పిస్తామని కోరగా అందుకు ఆమె నిరాకరించింది. జీవితంలో ఇన్ని కష్టాలు చూసినా కూడా ఆమె ముఖంపై చిరునవ్వు మాత్రం చెరగలేదు.