రిపబ్లిక్ డే ఉత్సవాల నిర్వహణపై తెలంగాణలో ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ చీఫ్ సెక్రటరీ.. జీఏడీ, ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. పరేడ్ ఎక్కడ నిర్వహించాలన్న దానిపై చర్చించుకున్నారు. రాజ్ భవన్ లోనే పరేడ్ నిర్వహించే అవకాశాలపైనే చర్చ నడిచినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో హైకోర్టు.. ప్రభుత్వానికి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం రిపబ్లిక్ డే ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని బుధవారం తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. రిపబ్లిక్ డే ఉత్సవాలను తెలంగాణలో అధికారికంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్ ను.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధిక్కరించిందని, రాష్ట్ర ప్రభుత్వం రిపబ్లిక్ డే వేడుకలను నిర్వహించడం లేదని పిటిషనర్ ఆరోపించారు.
పిటిషన్ ను విచారించిన హైకోర్టు.. రాష్ట్ర ప్రభుత్వం రిపబ్లిక్ డే వేడుకలను నిర్వహించాల్సిందే అని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పరేడ్ తప్పకుండా నిర్వహించాలని.. పరేడ్ తో కూడిన వేడుకలు జరగాలని, అయితే ఎక్కడ జరుపుకోవాలి అనేది ప్రభుత్వం నిర్ణయించుకోవాలని పేర్కొంది. కేంద్రం ఇచ్చిన గైడ్ లైన్స్ ని పాటించాల్సిందే అంటూ వెల్లడించింది. ఇదిలా ఉంటే గత ఏడాదిలానే రాజ్ భవన్ లోనే రిపబ్లిక్ డే వేడుకలను నిర్వహించాలని గవర్నర్ కార్యాలయం నిర్ణయం తీసుకుంది. రాజ్ భవన్ లోనే రిపబ్లిక్ డే వేడుకలు జరగనున్నాయి. గవర్నర్ తమిళిసై ఉదయం 7 గంటలకు జెండా ఆవిష్కరించనున్నారు.