Jagtial: బిడ్డలు పుట్టిన తర్వాత భార్యాభర్తల ప్రపంచం మారుతుంది. తల్లిదండ్రుల హోదాలో కొత్త బాధ్యతలు వారిపై వచ్చిపడతాయి. కన్న బిడ్డలపై తల్లిదండ్రులకు బాధ్యతను మించిన ప్రేమానురాగాలు ఉంటాయి. తమ రక్తం పంచుకుపుట్టిన వాళ్లు సంతోషంగా ఉండాలని తల్లిదండ్రులు భావిస్తుంటారు. అందుకోసం కష్టాలను సైతం ఇష్టాలుగా భరిస్తుంటారు. అలాంటిది కన్న బిడ్డలు దూరమైతే వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించగలమా.. కచ్చితంగా లేదు. ఆ బాధ కేవలం రక్తాన్ని పంచిన వారికే తెలుస్తుంది. అలా అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న తమ కూతురు చనిపోవటంతో నరకయాతన అనుభవిస్తోంది ఓ జంట.
అంతటి విషాదంలోనూ తమ గారాల పట్టి పుట్టిన రోజు వేడుకల్ని ఆమె సమాధి వద్ద జరిపి సంతోష పడింది. ఈ సంఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జగిత్యాల జిల్లా వెల్గటూర్కు చెందిన రాజు, రసజ్ఞలది అనోన్య దాంపత్యం. వీరి ప్రేమకు గర్తుగా జ్ఞానన్వి జన్మించింది. బిడ్డను ఎంతో ప్రేమగా చూసుకునేది ఆ జంట. పాపకు ఏ కష్టం రాకుండా కాపుకాసేది. అలాంటి బిడ్డ జీవితంలో విషాదం చోటుచేసుకుంది. నెల రోజుల కిందట బిడ్డ జ్వరం బారిన పడింది. రాజు, రసజ్ఞలు ఆసుపత్రుల్లో చూపించారు. అయినా లాభం లేకపోయింది. జ్వరం కారణంగా జ్ఞానన్వి మరణించింది.
పుట్టిన రోజుకు ఒక నెల ఉందన్న సమయంలో ఇలా జరగటం తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోయారు. అప్పటినుంచి ప్రతీ రోజు పాపను తల్చుకుని బాధపడూతునే ఉన్నారు. నిన్న జ్ఞానన్వి పుట్టిన రోజు(జయంతి) జరిగింది. తల్లిదండ్రులు అంత విషాదంలోనూ చిన్నారి బర్త్డే చేయాలనుకున్నారు. సమాధి వద్ద వేడుకను నిర్వహించారు. సమాధిపై కేక్, పాపకు ఇష్టమైన వస్తువుల్ని ఉంచారు. కేక్ కట్ చేసి పాప ఫొటోకు తినిపిస్తూ సంతోషపడ్డారు. ఆ మరుక్షణమే పాప లేదన్న చేదు నిజాన్ని గుర్తు చేసుకుని వెక్కి వెక్కి ఏడ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబందించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ ఫొటో చూస్తున్న నెటిజన్లు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.